ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CBN: అవినీతిని అడ్డుకుంటే దాడులు చేస్తారా?

దేవినేని ఉమామహేశ్వరావు కారుపై వైకాపా వర్గీయుల చేసిన దాడిని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడతారా? అని ఆయన ప్రశ్నించారు. వైకాపా అవినీతికి చక్రవడ్డీతో మూల్యం చెల్లించక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు.

By

Published : Jul 27, 2021, 10:23 PM IST

Published : Jul 27, 2021, 10:23 PM IST

Updated : Jul 28, 2021, 5:41 AM IST

దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై దాడిని ఖండించిన చంద్రబాబు
దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై దాడిని ఖండించిన చంద్రబాబు

వైకాపా నేతల అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులకు పాల్పడటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. వైకాపా నేతల అక్రమ మైనింగ్‌ను వెలుగులోకి తెచ్చేందుకు వెళ్లిన దేవినేని ఉమామహేశ్వరరావు కారుపై ఆ పార్టీ గూండాలు దాడి చేయడం దుర్మార్గమని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ‘ప్రజా సంపదను దోచుకుంటుంటే ప్రజల తరఫున అడ్డుకోవడం తప్పా? ఒక్కరిపై వంద మంది వైకాపా గూండాల దాడి పిరికిపంద చర్య. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి’ అని డిమాండ్‌ చేశారు. దాడి విషయం తెలుసుకున్న వెంటనే చంద్రబాబు ఫోనులో దేవినేని ఉమాతో మాట్లాడారు.మీ వెంట యావత్తు పార్టీ అండగా ఉంటుందన్నారు. ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మళ్లీ అధికారంలోకి రాలేమనే దోచుకునే ప్రయత్నం...:

జగన్‌రెడ్డి చేతగాని పాలనతో భవిష్యత్తులో వైకాపా మళ్లీ అధికారంలోకి రాదని ఆ పార్టీ నేతలకు అర్థమైందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘అందుకే అధికారం ఉండగానే అందినకాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులు, గుట్టలు, చివరకు శ్మశానాలనూ వదలడం లేదు. వైకాపా నేతల అరాచకాలు, దురాగతాలకు రానున్న రోజుల్లో చక్రవడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదు’ అని హెచ్చరించారు.

డీజీపీకి లేఖ:

దేవినేని కారుపై రాళ్లు రువ్విన వారిని వెంటనే అరెస్టు చేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ‘గత రెండేళ్లలో ఏపీ మాఫియాకు అడ్డాగా మారింది. వైకాపా నేతలు ఒక వర్గం పోలీసులతో కుమ్మక్కై అసమ్మతి స్వరాన్ని బెదిరింపులతో అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక ప్రజలు సమాచారం ఇచ్చిన తర్వాత సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో దాడి జరగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనం. ఇప్పటికైనా రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేలా డీజీపీ చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు.

అవినీతికి అడ్డుగా ఉన్నారని అంతమొందించే కుట్ర

వైకాపా అవినీతికి అడ్డుగా ఉన్నారనే కక్షతో దేవినేని ఉమామహేశ్వరరావును జగన్‌రెడ్డి, సజ్జలరెడ్డిలు అంతమొందించేందుకు కుట్రపన్నారు. పథకం ప్రకారమే ఆయనపై దాడి జరిగింది. దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులు సంఘటనా స్థలానికి రాలేదు. మాజీ మంత్రికే రక్షణ లేకుంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? దాడికి పాల్పడిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనతోపాటు డీజీపీ కార్యాలయం ముందుకు నిరసనకు దిగుతాం. - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఇదీ చదవండి:

Flash: మాజీ మంత్రి దేవినేని ఉమపై రాళ్ల దాడి

Last Updated : Jul 28, 2021, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details