రాష్ట్ర ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా వైకాపా పాలన ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. నిరంకుశ పరిపాలనకి ప్రజలందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవిస్తున్నారని ఆక్షేపించారు. ఆంధ్రప్రదేశ్ వివిధ జాతులు, సంస్కృతులకు పుట్టినిల్లని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి శాంతియుతంగా జీవించేవారని గుర్తు చేశారు. ఆలయాలు, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు, దాడులు 20 కి పైగానే జరిగాయని చంద్రబాబు ధ్వజమెత్తారు.
ఆ ఘటనలపై సీబీఐ విచారణ జరపాలి: చంద్రబాబు
ఆలయాల పవిత్రను అగౌరవపరిచేలా వైకాపా వ్యవహారిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
అంతర్వేది, బిట్రగుంటలో పరమ పవిత్ర రథాలను దహనం చేశారని... పిఠాపురంలో విగ్రహాలను కూల్చివేశారని మండిపడ్డారు. దేవారంపాడులో పూజారులపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమలలో ఏకంగా తితిదే అధికారులే అన్యమత ప్రచారం చేశారని ఆరోపించారు. సింహాచలం ఆలయ బోర్డును అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనలకు..... ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలపై... సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:నినాదాలు చేస్తేనే అరెస్టు చేస్తారా?: సోము వీర్రాజు