ఎన్టీఆర్, పీవీ నరసింహారావు వంటి మహనీయులను రాజకీయ ప్రయోజనాల కోసం రచ్చకీడుస్తారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు వారికి గర్వకారణంగా జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన వ్యక్తులు ఎన్టీఆర్, పీవీ నరసింహారావు అన్నారు. పేదల సంక్షేమానికి ఎన్టీఆర్ బాటలు వేస్తే, ఎన్నో సంస్కరణలతో దేశ ఆర్థికరంగాన్ని పరుగులు పెట్టించడమే కాకుండా, సాంకేతిక ఫలాలను పేదలకు అందించిన మేధావి పీవీ అని చంద్రబాబు కొనియాడారు.
హైదరాబాద్ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ పాత్ర అందరికీ తెలుసునన్న చంద్రబాబు... ఆ పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ ఘాట్ను కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. నిస్వార్థ రాజకీయాలతో, ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయే పథకాలతో తెలుగువారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్పై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం తెలుగువారందరినీ అవమానించడమేనని మండిపడ్డారు.