కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మరోసారి కేంద్ర బృందాలు పర్యటించనున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ నేతృత్వంలోని బృందం ఈ నెల 26 నుంచి 29 తేదీల్లో తెలంగాణ సహా... కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న గుజరాత్, మహారాష్ట్రలోనూ పర్యటించనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర బృందం రాష్ట్రాలతో చర్చించనుంది.
దేశంలో కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి.. రాష్ట్ర ప్రభుత్వాల అప్రమత్తతపై కేంద్రం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. అవసరమయితే తమ బృందాలను పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులను బట్టీ సూచనలు సలహాలు ఇస్తోంది.
తెలంగాణకు నాలుగోసారి...
కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో మొదటిసారి రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. గాంధీ ఆస్పత్రిలో వార్డుల ఏర్పాటు, మైక్రోబయాలజీ లాబ్ నిర్వహణ, టెస్ట్ లీక్ ప్రక్రియ, ఐసోలేషన్ ఏర్పాట్లను పరిశీలించింది. అనంతరం అరుణ్ భరోక సారథ్యంలో ఏప్రిల్ 25 నుంచి మే 2 వరకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందం.. కిందిస్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పరిస్థితులను సమీక్షించింది.