ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CENTRAL MINISTER BISHWESWAR ON POLAVARAM : 'పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు చెల్లించాం'

By

Published : Nov 30, 2021, 5:19 AM IST

పోలవరానికి రూ.11,600 కోట్ల చెల్లించినట్లు రాజ్యసభలో కేంద్ర జల్​శక్తిశాఖ మంత్రి బిశ్వేశ్వర్ టుడు(Central minister bishweswar tudu) వెల్లడించారు. 2019 మే నెల తర్వాత రూ.4,836 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు

పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.11,600.16 కోట్లు చెల్లించామని కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. 2019 మే నెల తర్వాత రూ.4,836 కోట్లు విడుదల చేసినట్లు సోమవారం రాజ్యసభలో తెదేపా సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌(TDP Rajya sabha member kanakamedala Ravindrakumar) అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2019-20కి సంబంధించి 2020 ఫిబ్రవరిలో రూ.1,850 కోట్లు, 2020-21లో రూ.2,234.20 కోట్లు, 2021-22లో ఇప్పటివరకు రూ.751.80 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు. 2019-20, 2020-21కి సంబంధించిన లావాదేవీలపై దిల్లీకి చెందిన ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఆడిట్‌ (వ్యవసాయం, ఆహారం, జలవనరులు) చెన్నై బ్రాంచ్‌ ఆడిట్‌ నిర్వహించినట్లు చెప్పారు.

2014-15 నుంచి 2016-17వరకు ఆడిట్‌ సర్టిఫికెట్లు అందినట్లు ఏపీ ప్రభుత్వం తమకు సమాచారం అందించిందన్నారు. 2017-18 నుంచి 2020-21వరకు పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చులకు సంబంధించిన లెక్కలపై అకౌంటెంట్‌ జనరల్‌ కార్యాలయం వారు ఆడిట్‌ నిర్వహించినట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల(Funds of Polavaram project) గురించి వైకాపా ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, పరిమళ్‌ నత్వాని అడిగిన మరో ప్రశ్నకు బిశ్వేశ్వర్‌ సమాధానమిస్తూ 2014 ఏప్రిల్‌ 1 నుంచి పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంకోసం చేసే వ్యయాన్ని 100% కేంద్రం సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చుచేసిన రూ.11,600.16 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించినట్లు వివరించారు.

2014 ఏప్రిల్‌ 1 నుంచి దీనిపై చేసిన వ్యయానికి సంబంధించి అందిన బిల్లులను పరిశీలించి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదంతో చేసిన ఖర్చులను తిరిగి చెల్లిస్తున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి(MP Vijaya Sai reddy) అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం దీర్ఘకాల సాగునీటి నిధి ద్వారా బడ్జెటేతర వనరుల రూపంలో నాబార్డు ద్వారా సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. ప్రాజెక్టు కోసం అవసరమైన నిధుల గురించి జల్‌శక్తిశాఖ వర్తమానం పంపిన వెంటనే నాబార్డ్‌ మార్కెట్‌ నుంచి నిధులు సమీకరించనుందని చెప్పారు. కొన్నిసార్లు రీయింబర్స్‌మెంట్‌ ప్రక్రియ పూర్తికి విభిన్న కారణాలవల్ల సమయం పడుతోందని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌కోసం సెప్టెంబరులో రూ.1,734.8 కోట్లకు, అక్టోబరులో రూ.353.18కోట్లకు కలిపి మొత్తం రూ.2,087.99 కోట్లకు లేఖరాసినట్లు చెప్పారు. అందులో రూ.711.60 కోట్ల చెల్లింపునకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సిఫార్సు చేసిందని వెల్లడించారు.

ఇవీచదవండి.

ABOUT THE AUTHOR

...view details