ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరోనా బాధితులకు వెసులుబాటు.. కొత్త మార్గదర్శకాలివే!

By

Published : Apr 29, 2020, 1:35 PM IST

కరోనా వైరస్‌ స్వల్ప లక్షణాలున్న వారు, వ్యాధి సోకినా ఆ లక్షణాలు లేనివారు ఇక నుంచి వారిళ్లలోనే చికిత్స పొందవచ్చు. స్వీయ నిర్బంధ వసతులు ఇళ్లలో ఉండి, ప్రభుత్వ వైద్య సిబ్బందికి ఎప్పటికప్పుడు సహకరించడానికి అంగీకరించే బాధితులకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెసులుబాటు కల్పించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. అయితే ప్రభుత్వాసుపత్రుల్లో పరిశీలనలో ఉన్నవారు, చికిత్స పొందుతున్న వారిలోనే కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు వెల్లడవుతున్న నేపథ్యంలో ఈ వెసులుబాటు ఎలాంటి ఫలితాలన్నిస్తుందోననే ఆందోళన వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది.

కరోనా బాధితులకు వెసులుబాటు.. కొత్త మార్గదర్శకాలివే!
కరోనా బాధితులకు వెసులుబాటు.. కొత్త మార్గదర్శకాలివే!

మార్గదర్శకాలు ఇవీ..

  • కరోనాకు సంబంధించిన లక్షణాలు అతి స్వల్పంగా ఉన్నట్లు, అసలేమీ లక్షణాల్లేవని వైద్యుడు నిర్ధారించాలి.
  • అలాంటి వారికి ఇళ్లలో వసతులుంటే.. వారి కుటుంబీకులతో కలవకుండా విడిగా గదిలో ఉండాలి.
  • ప్రభుత్వాసుపత్రి, వైద్యసిబ్బందితో నిరంతరం సమాచార మార్పిడికి అనుగుణంగా అందుబాటులో ఉండాలి.
  • ఈ వ్యక్తితో పాటు కుటుంబ సభ్యులు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలను వైద్యుల సూచనల మేరకు ముందస్తుగా వినియోగించాలి.
  • ఆరోగ్యసేతు యాప్‌ను మొబైల్‌లో తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. బ్లూటూత్‌, వైఫై సేవలు మొబైల్‌లో నిరంతరం పనిచేస్తుండాలి.
  • జిల్లా వైద్యాధికారి, వైద్యసిబ్బందికి తన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడూ తెలియజేస్తుండాలి.
  • ఇంటికి వైద్యసిబ్బంది వచ్చి పరీక్షించడానికి తన అంగీకారాన్ని తెలుపుతూ నిరభ్యంతర పత్రంపై సంతకం చేయాలి.
  • నిర్దేశిత గడువు పూర్తయిన అనంతరం నమూనాలను పరీక్షలకు పంపిస్తారు. అవి నెగిటివ్‌ అని నిర్ధారణ అయ్యాకనే ఇంట్లో ఐసోలేషన్‌ నుంచి విముక్తి పొందుతారు.

ఈ సమయాల్లో అప్రమత్తమవ్వాలి?

  • ఇంట్లో విడి గదిలో ఉన్న సమయంలో ఎలాంటి అస్వస్థత అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. 1075 నంబరుకు ఫోన్‌ చేయాలి.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనప్పుడు
  • ఆగకుండా నొప్పి, ఛాతీలో పట్టేసినట్లుగా ఉన్నప్పుడు
  • మానసిక అయోమయం, చేతల్లో స్థిరత్వం లోపించినప్పుడు
  • పెదవులు, ముఖం నీలిరంగులో మారుతున్నప్పుడు

ఇంట్లో జాగ్రత్తలు

  • నిరంతరం మూడంచెల మాస్కు ధరించాలి. 8 గంటలకొకసారి దాన్ని మార్చాలి.
  • వాడేసిన మాస్కును ఒకశాతం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణంతో శుభ్రపర్చి పడేయాలి.
  • పిల్లలు, వృద్ధులు, అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాలు, గుండె, కాలేయ సమస్యలతో దీర్ఘకాలంగా బాధపడుతున్న వారికి దూరంగా ఉండాలి.
  • ఇంట్లో సాధ్యమైనంత వరకూ విశ్రాంతి తీసుకోవాలి.
  • నీరసంగా ఉండకుండా నీరు, ఇతర ద్రావణాలను సేవించాలి.
  • చేతులను ఆల్కహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలి.
  • ఈ వ్యక్తి వాడిన దుస్తులు, వస్తువులను ఇతరులు వినియోగించరాదు.

ఇదీ చూడండి:భళా ఈశాన్య భారతం- కరోనా రహితంగా ఆ ఐదు రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details