ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ADDITIONAL LOANS: మరో రూ.2,655 కోట్ల అదనపు రుణం.. - ఏపీ తాాజా సమాచారం

అప్పు కోసం సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఊరట ఇచ్చింది. మార్కెట్ల నుంచి రూ.2,655 కోట్లు సమీకరించుకునేందుకు.. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనుమతించింది. మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న ఏపీ సహా 11 రాష్ట్రాలకు.. 2021-22 మొదటి త్రైమాసికంలో అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్ధికశాఖ అనుమతించింది.

AP
AP

By

Published : Sep 15, 2021, 7:41 AM IST

కేంద్ర ఆర్థికశాఖ 2021-22 తొలి త్రైమాసికానికి నిర్దేశించిన మూలధన వ్యయ లక్ష్యాన్ని చేరుకున్నందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌తోపాటు మరో పది రాష్ట్రాలకు బహిరంగ మార్కెట్‌ నుంచి జీఎస్‌డీపీలో 0.25%కి సమానమైన రూ.15,721 కోట్లు అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఏపీకి రూ.2,655 కోట్ల అదనపు రుణం పొందడానికి వీలవుతుంది. ఈ జాబితాలో బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, హరియాణ, కేరళ, మధ్యప్రదేశ్‌, మణిపుర్‌, మేఘాలయ, నాగాలాండ్‌, రాజస్థాన్‌, ఉత్తరాఖండ్‌ ఉన్నాయి. ఈ అదనపు రుణ సేకరణకు అనుమతి వల్ల మూల ధన వ్యయాన్ని మరింత పెంచడానికి అవసరమైన వనరులు రాష్ట్ర ప్రభుత్వాలకు అందుబాటులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.

మూలధన వ్యయంతో బహుముఖ ప్రభావం ఉంటుందని, దానివల్ల భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక ఉత్పాదకత పెరిగి అధిక వృద్ధి సాధ్యమవుతుందని విశ్లేషించింది. అందుకే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్‌ నుంచి (జీఎస్‌డీపీలో 4%) తీసుకొనే రుణాల్లో, 0.50% (జీఎస్‌డీపీలో) మొత్తాన్ని మూలధన వ్యయం కోసం ఖర్చుచేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా విధించింది. ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం పూర్తయ్యేనాటికి అందులో 15%, రెండో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 45%, మూడో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 70%, నాలుగో త్రైమాసికం పూర్తయ్యేనాటికి 100% ఖర్చుచేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ లక్ష్యాలను పూర్తిచేసిన రాష్ట్రాలకు ప్రతి త్రైమాసికానికి ఒకసారి అదనపు రుణం తీసుకోవడానికి అనుమతిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు 0.25% రుణ సేకరణకు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఖర్చుపై వచ్చే డిసెంబరులో రెండో విడత సమీక్షిస్తారు. సెప్టెంబర్‌ 30వ తేదీవరకు చేసిన ఖర్చులను విశ్లేషించి అప్పుడు నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తిచేసి ఉంటే మరో 0.25% అప్పునకు అనుమతిస్తారు.

ఏపీకి కలిసొచ్చిన సడలింపు

రాష్ట్రాలు ఆస్తులు సృష్టించేందుకు నిర్దిష్ట మొత్తం ఖర్చు చేస్తేనే మరింత రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తామని కేంద్రం ఆర్థిక సంవత్సరం మొదట్లోనే షరతు పెట్టింది. కరోనా నేపథ్యంలో.. రాష్ట్రాల కోరిక మేరకు తొలి త్రైమాసికంలో మూలధన వ్యయ మొత్తంలో 20శాతం ఖర్చు చేయాలన్న షరతును 15శాతానికి తగ్గించింది. దీంతో అదనపు రుణ సౌలభ్యం ఏర్పడింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం రూ.27,589 కోట్లు మూలధన వ్యయంగా ఖర్చు చేయాలని కేంద్రం తొలుత షరతు పెట్టింది. ఆ తర్వాత మార్పుల్లో పరిమితి రూ.26,262 కోట్లకు తగ్గింది. మూలధన పరిమితిలో కొంత, ఖర్చు చేయాల్సిన పరిమితిలో కొంత తగ్గించడం వల్ల డిసెంబరు వరకూ రాష్ట్రానికి రూ.10,155 కోట్ల రుణ సౌలభ్యం ఉంది.

ఇదీ చదవండి

handloom: వైకాపా రెండున్నరేళ్లలో.. ఒక్క క్లస్టరూ ఏర్పాటు కాని వైనం

ABOUT THE AUTHOR

...view details