జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్పై సీబీఐ తన తటస్థ వైఖరిని కొనసాగించింది. ఈనెల 1న రఘురామ కృష్ణరాజు, జగన్ తరఫు వాదనలు విన్న సీబీఐ కోర్టు.. ఇవాళ జగన్, రఘురామతో పాటు సీబీఐని కూడా వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదేశించింది. ఇవాళ జగన్, రఘురామ మాత్రమే లిఖితపూర్వక వాదనలు దాఖలు చేశారు. పిటిషన్లోని అంశాలను విచక్షణ మేరకు, చట్ట ప్రకారం కోర్టే నిర్ణయం తీసుకోవాలని గత నెల 1న దాఖలు చేసిన మెమోనే తమ వాదనగా పరిగణనలోకి తీసుకోవాలని.. లిఖితపూర్వక వాదనలేమీ లేవని ఇవాళ సీబీఐ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానానికి తెలిపారు.
రఘురామ లిఖితపూర్వక వాదనలు..
కోర్టు షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణరాజు లిఖితపూర్వక వాదనల్లో కోరారు. తనకు పిటిషన్ వేసే అర్హత ఉందని సీబీఐ కోర్టు ఏప్రిల్ 27నే తేల్చిందని.. ఎవరైనా పిటిషన్ వేయవచ్చునని సుప్రీంకోర్టు, హైకోర్టులో గతంలో స్పష్టతనిచ్చాయని వివరించారు. సాక్షుల మనసులో భయం కలిగించేందుకు సహచర నిందితులకు పలు ప్రయోజనాలు, కీలక పదవులు కల్పించారన్నారు. ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉన్న సజ్జల దివాకర్ రెడ్డి సోదరుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారని రఘురామ తెలిపారు. మోపిదేవి వెంకటరమణను రాజ్యసభ సభ్యుడిగా, మురళీధర్ రెడ్డిని కలెక్టర్గా, వైవీ సుబ్బారెడ్డిని తితిదే ఛైర్మన్ గా నియమించారన్నారు.
నిందితుడు నిమ్మగడ్డ ప్రసాద్ సెర్బియాలో అరెస్టయినప్పుడు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి వద్దకు ఎంపీల బృందాన్ని పంపించి ఒత్తిడి తెచ్చారన్నారు. అరబిందోకు కాకినాడ సెజ్ అభివృద్ధి పనులు, హెటిరోకు విశాఖ బేపార్క్ రిసార్టు నిర్వహణ, తన కుటుంబానికి చెందిన జగతి పబ్లికేషన్స్కు భారీగా ప్రకటలను ఇచ్చి లబ్ధి చేకూర్చారని లిఖితపూర్వక వాదనల్లో తెలిపారు. ముఖ్యమంత్రిగా జగన్.. ప్రభుత్వంలో వివిధ పదవుల్లో సహ నిందితులు.. సాక్షులుగా ఉన్న అధికారులను ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రలోభపెట్టే అవకాశం ఉందని రఘురామ తన వాదనల్లో పేర్కొన్నారు.
సాక్షులుగా ఉన్న సీనియర్ అధికారులను పరోక్షంగా బెదిరించేందుకు అఖిల భారత సర్వీసుల అధికారుల ఏఏఆర్ లను సమీక్షించే అధికారాన్ని జగన్ తన పరిధిలోకి తెచ్చుకున్నారనేది రఘురామ వాదన. బెయిల్ రద్దు చేయడానికి ఇది కూడా కారణంగా పరిగణించాలని కోర్టును కోరారు. సాక్షిగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ను చెప్పినట్లు విననందుకు వేధించారని ఆరోపించారు. రాజ్యాంగ స్వయంప్రతిపత్తి ఉన్న ఎస్ఈసీనే వేధించారంటే.. ఇక ఇతర అధికారుల పరిస్థితని ఊహించుకోవచ్చునన్నారు.
తనపై ఏపీ పోలీసుసు నమోదు చేసిన ఏడు కేసుల్లో ప్రాథమిక సాక్ష్యాలు లేవని ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు. పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలని కోర్టుకు సూచించారు. జగన్ బెయిల్ రద్దు చేసేందుకు తనపై వేధింపుల ఘటన ఒక్కటి చాలని రఘురామ ఉదహరించారు. తన వాదనలను జగన్ తోసిపుచ్చలేదని.. కాబట్టి వాటిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని ఎంపీ కోరారు.