ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 8, 2021, 11:55 PM IST

Updated : Aug 9, 2021, 4:51 AM IST

ETV Bharat / city

AMARAVATI: నిర్బంధాలను ఛేదించి.. ఆలయానికి చేరుకొని

అమరావతిలో రైతులు చేపట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' కార్యక్రమం పూర్తైంది. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఏర్పాటు చేసిన అవరోధాలు, అనేక చోట్ల నిర్బంధాలను దాటుకుని ర్యాలీని పూర్తి చేశారు. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంపై తాడేపల్లి, మంగళగిరి స్టేషన్లలో 61 కేసులు నమోదయ్యాయి.

AMARAVATI
AMARAVATI

దృఢ సంకల్పంతో అమరావతి రైతులు తలపెట్టిన 'న్యాయస్థానం నుంచి దేవస్థానం' కార్యక్రమం అనేక అవరోధాలను దాటుకుని పూర్తైంది. మంగళగిరిలోని పానకాలస్వామి గుడిలో తుళ్లూరు మహిళలు పూజలు చేశారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని స్వామివారిని మెుక్కుకున్నారు.

ఉక్కుపాదం మోపే చర్యలన్నింటినీ అధిగమించిన రాజధాని రైతులు మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకోగలిగారు. వారు తలపెట్టిన ‘న్యాయస్థానం నుంచి దేవస్థానానికి’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆలయం చుట్టూ ఇనుప కంచెలు వేసేసి.. భారీగా పోలీసుల్ని మోహరించినా... అన్నింటినీ దాటుకుని 20 మందికి పైగా రైతులు దఫదఫాలుగా ఆలయంలోకి చేరుకోగలిగారు. పోలీసులు గుడి లోపలే వారిని అదుపులోకి తీసుకుని ఈడ్చుకుంటూ తీసుకొచ్చి మరీ వాహనాల్లో కుక్కేశారు. ఓ మహిళనైతే కాళ్లు చేతులు లాగేసి లాక్కెళ్లిపోయారు. తొలుత కొందరు రాజధాని రైతులు కొండపైనున్న పానకాలస్వామి ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు ఘాట్‌రోడ్డు కిందే అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఉద్యమకారులు పలువురిని ఆ ఘాట్‌రోడ్డు వద్ద అడ్డుకోగా.. వారికి, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రాజధాని రైతులు ఒక్కొక్కరుగా విడిపోయి సాధారణ భక్తుల మాదిరిగా కొండ దిగువనున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోకి చేరుకున్నారు. ఆలయంలోకి చేరుకుని నినాదాలు చేసిన ఓ మహిళా రైతును పోలీసులు కర్కశంగా ఈడ్చుకొచ్చేశారు. ‘మా భూముల్ని తీసుకుని... మాపైనే దౌర్జన్యం చేస్తారా’ అంటూ ఆమె కన్నీరుమున్నీరయ్యారు. మరో మహిళా రైతునూ ఇలాగే ఈడ్చేశారు. గుంటూరు ప్రాంతాల నుంచి మంగళగిరికి చేరుకునే వారి కోసం కాజ టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేయించారు. మంగళగిరి పట్టణంలో అణువణువునా పహారా కాశారు. ఆదివారం కావడంతో మంగళగిరిలోని పానకాల స్వామి, లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ఆయా ఆలయాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పోలీసులు తీవ్ర ఆంక్షలు అమలు చేయడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయా వీధులకు చెందిన ప్రజలు మధ్యాహ్నం 2 గంటల వరకూ ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు.

రైతులపై కేసులు..

అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులపై గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి తాడేపల్లి, మంగళగిరి పోలీస్‌ స్టేషన్లలో 61 మందిపై కేసులు పెట్టారు. అమరావతి ఉద్యమానికి 600 రోజుల పూర్తైన సందర్భంగా రైతులు ర్యాలీ నిర్వహించడంతో కేసు నమోదు చేశారు. ముందునుంచే రైతుల ర్యాలీకి అనుమతి నిరాకరిస్తూ వస్తున్న పోలీసుశాఖ.. నేడు రైతులు ర్యాలీ చేపట్టడంతో చర్యలకు ఉపక్రమించింది.

ఇదీ చదవండి:

AMARAVATI: రాజధాని గ్రామాల్లో అడుగడుగునా ఆంక్షలు.. ఉద్రిక్తత.. 61 మందిపై కేసులు

Last Updated : Aug 9, 2021, 4:51 AM IST

ABOUT THE AUTHOR

...view details