ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేంద్ర బడ్జెట్​ 2021 - 22: పట్టణాభివృద్ధికి ప్రాధాన్యత

2024 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదగాలన్నది మోదీ సర్కార్ కల. ఇది సాధ్యం కావాలంటే...అభివృద్ధి అనేది ఏ కొద్ది ప్రాంతాలకే పరిమితం కాకూడదు. అన్ని చోట్లా పురోగతి పరుగులు తీయాలి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన ఇంకా మెరుగు పడాలి. దేశంలో మూడొంతుల జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నారు. జీడీపీలో మూడింట రెండొంతుల వాటా పట్టణాలదే. అందుకే...ఈ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. పద్దులో ఈ అంశానికి ప్రాధాన్యతనిచ్చింది కూడా. తాగు నీరు నుంచి ప్రజా రవాణా వరకు అన్ని అంశాల్లోనూ పట్టణాలు పురోగతి సాధించేలా నిధులు కేటాయించింది. కొన్ని ప్రత్యేక పథకాలనూ ప్రకటించింది.

By

Published : Feb 2, 2021, 2:26 PM IST

budget 2021-22
బడ్జెట్ 2021-22

పట్టణాల్లో జీవన ప్రమాణాలు పెరగాలి..! మొదటి నుంచి మోదీ సర్కార్ ఇదే లక్ష్యంతో పని చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు పట్టణాల్లోనూ ఇంకా మెరుగైన సౌకర్యాలు అందించాలని కృషి చేస్తోంది. ఈ అంశానికి కట్టుబడి ఉన్నామని ప్రస్తుత పద్దుతో మరోసారి తేల్చి చెప్పింది కేంద్రం. బడ్జెట్‌లో పట్టణ జీవన ప్రమాణాలు పెంచే దిశగా ప్రత్యేక కేటాయింపులు చేసింది. అత్యవసరమైన తాగునీరు నుంచి పారిశుద్ధ్య నిర్వహణ, నిర్మాణాలు లాంటి అంశాలకు ప్రాధాన్యత నిచ్చింది. ముఖ్యంగా...స్వచ్ఛ భారత్‌ 2.0 పేరిట పట్టణాలను పరిశుభ్రతకు చిరునామాలుగా మార్చాలని సంకల్పించింది. ఐదేళ్లలో పట్టణాల రూపు రేఖలు మారేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.

బడ్జెట్ 2021-22

జల్ జీవన్ మిషన్

పట్టణాల్లో నీరు దొరకటమే కష్టం. ఇక మంచినీరు లభ్యమవటం గగనమైపోయింది. వందలకు వందలు ఖర్చు చేస్తే కానీ...స్వచ్ఛమైన నీరు తాగలేరు. ఈ దుస్థితి మారాలన్నది కేంద్రం ప్రధాన లక్ష్యం. అందుకే...పట్టణాల్లో మంచి నీరందించే పథకానికి శ్రీకారం చుట్టనుంది. మొత్తం 4 వేల 378 పట్టణాల్లో ఈ పథకం అమలు కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ...మంచి నీటి ప్రాధాన్యాన్ని ఎన్నో సార్లు పలు నివేదికల ద్వారా వెల్లడించింది. ఇప్పుడు అదే విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో గుర్తు చేశారు. జల్‌ జీవన్ మిషన్‌ పేరిట నిర్దేశిత పట్టణాల్లోని 2 కోట్ల 86 లక్షల కుటుంబాలకు నల్లా కనెక్షన్‌లు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇక అమృత్‌ పరిధిలోని 500 పట్టణాల్లో నీటి వృథాను నిలువరించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు విత్తమంత్రి నిర్మలా సీతారామన్.

పరిశుభ్రత ముఖ్యం

ఇక పట్టణాల్లో పరిశుభ్రతకూ ప్రాధాన్యతనిచ్చింది కేంద్రం. స్వచ్ఛ భారత్‌ మిషన్ 2.0 అమలు చేసేందుకు లక్షా 41 వేల 678 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు ఇది అమలు కానుంది. పట్టణాలన్నింటినీ 100% బహిరంగ మలవిసర్జన రహిత ప్రాంతాలుగా మార్చాలని గతంలోనే కేంద్రం లక్ష్యం పెట్టుకుంది. అదే సమయంలో ఘన వ్యర్థాల నిర్వహణనూ పటిష్టంగా చేపట్టాలని నిర్దేశించుకుంది. ఇప్పుడు స్వచ్ఛ భారత్‌ 2.0లో భాగంగా... మురుగు నీటి నిర్వహణపైనా దృష్టి సారించింది. మురుగు నీటిని రీసైక్లింగ్ చేసేలా స్థానిక యంత్రాంగాలు చొరవ చూపాలని చెబుతోంది కేంద్రం. నీటి వృథా నిర్వహణ, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్తను సరైన పద్ధతిలో వేరు చేయటం, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను తగ్గించటం, వాయు కాలుష్యం, క్రమ పద్ధతిలో నిర్మాణాలు లాంటి అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించింది కేంద్రం. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

ప్రజా రవాణా విస్తరణకు కసరత్తులు

ప్రపంచ ఆర్థిక వేదిక-2020 ప్రకారం...ప్రపంచంలోని 10 అత్యంత కలుషిత నగరాలు.. భారత్‌లోనే ఉన్నాయి. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం...మెట్రో లాంటి ప్రజా రవాణాను వీలైనంత ఎక్కువగా అందుబాటులోకి తీసుకురావటం. అందుకే..కేంద్రం ఈ అంశంపైనే ఎక్కువగా దృష్టి సారించింది. బస్‌లు, మెట్రో రైళ్లు లాంటి ప్రజా రవాణాను విస్తరించేలా ప్రత్యేక పథకం తీసుకురానుంది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజా రవాణాను విస్తృతం చేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇందుకోసం 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. వాయు కాలుష్య సమస్య పరిష్కారానికి 2 వేల 217 కోట్ల రూపాయలు కేటాయించారు. పోషకాహార లోపాన్ని అధిగమించేలా...మిషన్ పోషణ్ 2.0 కూడా అమలు చేయనున్నట్టు తెలిపారు.

ప్రజలకు అందుబాటులో ధరలు ఉండేందుకు...

పీపీపీ మోడల్‌లో భాగంగా 20 వేల బస్సుల్ని నడపాలని భావిస్తోంది. బస్సులతో పాటు ఇతరత్రా ప్రజా రవాణా వాహనాల సంఖ్య పెంచేందుకు కృషి చేయనుంది. కొత్త పథకం ద్వారా ఆటోమొబైల్ రంగం పురోగతి సాధించటమే కాక...ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని కేంద్రం వివరిస్తోంది. చెన్నైలో మెట్రో రైల్‌ ఫేజ్‌-2, బెంగళూరులో మెట్రో రైల్ ప్రాజెక్టు, నాగ్‌పూర్‌లో మెట్రో ప్రాజెక్టు ఫేజ్ 2తో సహా నాసిక్‌లో మెట్రో రైలు రవాణా విస్తృతం చేస్తామని ప్రకటించింది. టెయిర్-1, టెయిర్-2 నగరాల్లో ప్రజా రవాణా అందుబాటు ధరలో ఉండాలని భావిస్తోంది కేంద్రం. కొచ్చి మెట్రో ఫేజ్‌-2 కోసం వెయ్యి 957 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక చెన్నై మెట్రో ఫేజ్‌-2 పనులకు 63 వేల 246 కోట్ల రూపాయలు, బెంగళూరు మెట్రో పనులకు 14 వేల 788 కోట్ల రూపాయల చొప్పున కేటాయించింది.

వంట గ్యాస్​పై కీలక ప్రకటన

బడ్జెట్‌లో వంటగ్యాస్‌కి సంబంధించి మంత్రి కీలక ప్రకటన చేశారు. మూడేళ్లలో మరో 100కు పైగా నగరాలను గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ పరిధిలోకి తీసుకువస్తామని తెలిపారు. ఈ విధానం అమలులోకి వస్తే దేశ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్న మంత్రి..జమ్మూ కశ్మీర్‌లో కొత్త గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ చేపట్టనున్నట్లు తెలిపారు. ఉజ్వల పథకం కింద మరో కోటి మందికి లబ్ది కల్పిస్తామని ప్రకటించారు.

ఇదీ చదవండి:'రైతు సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది'

ABOUT THE AUTHOR

...view details