చెల్లెలి పెళ్లి చేసిన రోజే అన్న దుర్మరణం చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. బంధువులను దించేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తొగుట మండలం ఎల్లారెడ్డిపేటకు చెందిన బైతి పరశురాములు(38) చెల్లెలి వివాహం గురువారం మధ్యాహ్నం జరిగింది. వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నా తనకు ఇద్దరూ కుమారులే కావడంతో సోదరి వివాహంలో కన్యాదాతగా వ్యవహరించాడు. సిద్దిపేట మండలం మందపల్లిలో ఇద్దరు బంధువులను దించేందుకు సాయంత్రం ఇన్నోవా కారులో మొత్తం ఆరుగురు ప్రయాణించారు.
వారిద్దరినీ దించేసి మిగిలిన నలుగురు తిరిగి వస్తుండగా.. గురువారం అర్ధరాత్రి తడకపల్లి పాఠశాల వద్ద ఒక చెట్టును వేగంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పరశురాములు అక్కడికక్కడే మరణించాడు. ఇతని చిన్నాన్న కొడుకు బైతి నాగేశ్(22), తమ్ముడి బావమరిది చేర్యాల మండలం కమలాయపల్లికి చెందిన రాగుల అజయ్(30) హైదరాబాద్లో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. మరో బంధువు ఐలయ్యకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వాహనం వేగంగా నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీఐ సురేందర్రెడ్డి, ఎస్సై శంకర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.