ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 1, 2020, 8:28 PM IST

Updated : Jul 2, 2020, 10:18 AM IST

ETV Bharat / city

ఆశలు రేపుతున్న కరోనా వ్యాక్సిన్.. అతి త్వరలో రాబోతోంది..

కరోనా వ్యాక్సిన్ ఎప్పుడొస్తుంది..? ఇంకెన్నాళ్లు నిరీక్షించాలి..? ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ. కరోనా తీవ్రత పెరుగుతున్న తరుణంలో విరుగుడు కనిపెట్టేందుకు భారత్ బయోటెక్‌ సంస్థ ముందడుగు వేసింది. "కొవాగ్జిన్‌" పేరిట వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. మొదటి, రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహణకు డీసీజీఐ అనుమతి కూడా పొందింది. వచ్చే నెలలో మనుషులపై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది భారత్ బయోటెక్. ప్రపంచమంతటినీ వణికిస్తున్న వైరస్‌కు భారతదేశం నుంచే వ్యాక్సిన్ వస్తుందని... అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ విరుగుడు తయారు చేస్తున్నామంటున్న "భారత్‌ బయోటెక్" అధిపతి డాక్టర్ కృష్ణా ఎల్లతో ముఖాముఖి.

bharat-biotech-chairman-krishna-ella-interview-on-corona-vaccine
"భారత్‌ బయోటెక్" అధిపతి డాక్టర్ కృష్ణా ఎల్లతో ముఖాముఖి

"భారత్‌ బయోటెక్" అధిపతి డాక్టర్ కృష్ణా ఎల్లతో ముఖాముఖి

ఈటీవీ భారత్​: వైరస్‌ నివారణకు వ్యాక్సిన్‌ ఎప్పటిలోగా మార్కెట్‌లోకి వస్తుందని మీరు భావిస్తున్నారు?

జ. క్లినికల్​ ట్రయల్స్​ పూర్తయ్యేవరకు వ్యాక్సిన్​ మార్కెట్​లోకి ఎప్పుడు వస్తుందనేది స్పష్టంగా చెప్పలేము. ఒక విషయమేమిటంటే భారతీయ ఔషధ కంపెనీ కూడా గ్లోబల్​ క్లినికల్​ ట్రయల్స్​కి వెళ్తుందనేది సంతోషించదగ్గ విషయం.

ఈటీవీ భారత్​: ప్రపంచానికి మొదటిగా కరోనా వ్యాక్సిన్‌ భారత బయోటెక్‌ అందిస్తుందని ఆశించవచ్చా?

జ. కచ్చితంగా. సాంకేతికతలో చైనా, రష్యాల కన్నా భారతీయ సంస్థలు ముందంజలో ఉన్నాయి. కానీ కరోనా విపత్కర పరిస్థితిలో కొంచెం ఆలస్యమయ్యాము. ఇది కూడా మన తప్పిదం కాదు. చైనా వాళ్ల నుంచి సరైన సమాచారం రాకపోవడమే దీనికి కారణం.

ఈటీవీ భారత్​: భారత్‌ బయోటెక్‌ ప్రస్తుతం క్లినికల్‌ ట్రయల్స్‌ వరకూ వచ్చింది. జులై నెలలో మీ ముందున్న లక్ష్యాలేంటీ?

జ. వచ్చే వారంలో క్లినికల్​ ట్రయల్స్​ ప్రారంభమవ్వొచ్చు. నైతిక కమిటీ అనుమతులు వస్తున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ... కొవిడ్​ రహిత వాలంటీర్స్​ను నియమించుకోవాలి. దేశవ్యాప్తంగా మాకున్న 10 కేంద్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈటీవీ భారత్​: మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ ఎలా ఉండబోతున్నాయి?

జ. మూడో దశ మా చేతుల్లో ఉండేది కాదు. ప్రభుత్వానికి రెండు విధానాలు ఉన్నాయి. మొదటి రెండు దశలు విజయవంతమైతే మార్కెట్​ చేసుకునే అవకాశం కల్పించవచ్చు. క్లినికల్​ డేటా సరిగ్గా లేనట్లయితే మూడో దశ​ ట్రయల్స్​ చేయమని సూచించవచ్చు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతిలో ఉండే అంశం.

ఈటీవీ భారత్​: ఇప్పటివరకూ సాధించిన పురోగతిపై మీ అభిప్రాయమేంటి?

జ. మొదట్లో కాస్త ఆలస్యమైనప్పటికీ ఇప్పుడు వేగం పెంచాము. ఈ ప్రక్రియ ఇప్పుడు మరితం ఊపందుకుంటుంది.

ఈటీవీ భారత్​: మీకు ఔషధ రంగంలో అపారమైన అనుభవం ఉంది. మీ అంచనాల ప్రకారం వ్యాక్సిన్​ ఎప్పటివరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది?

జ. క్లినికల్​ డేటా పూర్తయ్యే వరకు మనం ఒక నిర్ధరణకు రాలేము. ఆస్ట్రాలజీలా చెప్పడం కుదరదు... సైన్స్​ చాలా ముఖ్యమైనది కదా. కచ్చితంగా ఈ వ్యాక్సిన్​ చాలా ప్రభావం చూపిస్తుందనే నమ్మకం మాత్రం ఉంది. ఒక వేళ ఇది కనుక పని చేయకపోతే మిగతావి కూడా పని చేయలేవని చెప్పగలను.​

ఈటీవీ భారత్​: మీరు చాలా రకాల వ్యాధులకు వ్యాక్సిన్​లను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటికంటే భిన్నంగా ఈ వ్యాక్సిన్​పై మీకున్న నమ్మకమేంటి?

జ.. ఇనాక్టివేషన్​ పద్దతిలో మేము ఇదివరకే ఆరు రకాల వ్యాక్సిన్​లను అందుబాటులోకి తీసుకొచ్చాం. జికా, చికెన్​గున్యా, ఇంజెక్టబుల్​ పోలియో, రేబిస్, తదితర వ్యాధులకు ఈ పద్ధతిలోనే వ్యాక్సిన్​లను తయారుచేశాం. తాజాగా చైనా​ వాళ్లు మొదటి, రెండో దశ క్లినికల్​ డేటాను ప్రచురించారు. ఇనాక్టివేషన్​ పద్దతి బాగా పనిచేసిందని దాంట్లో వివరించారు. మేము కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నాము. వాళ్ల కంటే భిన్నంగా ఉండేలా వేరే పద్దతులను కూడా కలుపుకొని ప్రయోగాలు చేస్తున్నాం. కాబట్టి వాళ్ల కంటే మనం 10 అడుగులు ముందే ఉంటామని అనుకుంటున్నాను.

ఈటీవీ భారత్​: వ్యాక్సిన్​ విషయంలో భారతీయ వైద్య పరిశోధన మండలి- ICMR, పుణె నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ-NIV నుంచి మీకు ఎలాంటి సహయ, సహకారాలు అందుతున్నాయి.?

జ. నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ-పుణె నుంచి చాలా సహాయ సహకారాలు అందాయి. నమూనాలు ఇచ్చిపుచ్చుకోవడం మొదలు అన్ని రకాలుగా వారి నుంచి తోడ్పాటు లభిస్తోంది. ఇది పూర్తిగా పబ్లిక్​-ప్రైవేటు భాగస్వామ్యంలో జరుగుతోంది.

ఈటీవీ భారత్​: ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లభిస్తుంది?

జ. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం తీసుకోవచ్చన్నారు. కానీ దేశం ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు డబ్బులు తీసుకోవడానికి మనసు ఒప్పుకోలేదు. దేశ హితం కోసం సంస్థ డబ్బులతో సొంతంగా దీనిని రూపొందించి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

ఈటీవీ భారత్​: ఇంతకీ బీఎస్​ఎల్​ అంటే ఏంటీ? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకొని బీఎస్​ఎల్​ను ఏర్పాటు చేశారు?

జ. బీఎస్​ఎల్​ అంటే బయోసేఫ్టీ లెవల్‌ అని అర్థం. ఆ లెవల్​ లోపల పని చేయడానికి కావాల్సిన కంటైన్మెంట్​ని తెలిపేది. బీఎస్​ఎల్-1, బీఎస్​ఎల్-2, బీఎస్​ఎల్-3 అని మూడు రకాలుగా ఉంటాయి. బీఎస్​ఎల్-3 అనేది ఇందులో చివరిది. అందులో పని చేసేవారికి వైరస్​ ఇన్​ఫెక్ట్​ అవకుండా, గాలిలోకి వ్యాపించకుండా, అలాగే అండర్​గ్రౌండ్​లోని నీళ్లల్లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటారు. నేను గర్వంగా చెబుతున్నా... ప్రపంచంలోని మొట్టమొదటి బీఎస్​ఎల్-3 సౌకర్యమున్నది మన దేశంలోనే అని. చైనా, రష్యా, యూరప్​లలో కూడా ఈ సౌకర్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. తెలంగాణలోని హైదరాబాద్​లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.

ఈటీవీ భారత్​: బయోసేఫ్టీ లెవల్‌-3లో ఇప్పటివరకు ఏయే వ్యాక్సిన్​లను తయారుచేశారు?

జ. బీఎస్​ఎల్-3లో ఇదే మొదటి వ్యాక్సిన్​. రేబీస్​ లాంటి వాటికి బీఎస్​ఎల్-2 సరిపోతుంది. వేరే వాటికి వీటి అవసరం అంతగా ఉండదు. వ్యాక్సిన్​ అందుబాటులో ఉండి ఉంటే దానితో బీఎస్​ఎల్-2లో పని చేస్తే సరిపోయేది. వ్యాక్సిన్​ లేదు కాబట్టి కచ్చితంగా బీఎస్​ఎల్-3లోనే పనిచేయాలి.

ఈటీవీ భారత్​: బీఎస్​ఎల్-1, బీఎస్​ఎల్-2, బీఎస్​ఎల్-3లను ఎంపిక చేసుకునే విధానం ఎలా ఉంటుంది?

జ. మానవులపై వైరస్​ తీవ్రతలను బట్టి వీటిని ఎంచుకుంటాం. వ్యాక్సిన్​ అందుబాటులో లేదు, వైరస్​ తీవ్రత కూడా ఎక్కువ కాబట్టి బీఎస్​ఎల్-3లోనే పని చేయాల్సి వస్తుంది. అదే ఒక వేళ వ్యాక్సిన్​ అందుబాటులో ఉన్నట్లయితో వ్యాక్సినేషన్​ చేసుకొని బీఎస్​ఎల్-1, బీఎస్​ఎల్-2లలో ఉత్పత్తి చేయవచ్చు.

ఈటీవీ భారత్​: కరోనా తన జన్యురూపాన్ని అనేక రకాలుగా మార్చుకుంటోంది. దాదాపు 149 రకాలుగా పరివర్తనం చెందిందని వింటున్నాం. వ్యాక్సినేషన్​ విషయంలో మీరు ఎలాంటి విధానాలు అవలంభిస్తున్నారు?

జ. మూడు రకాలుగా వ్యాక్సిన్​ను అభివృద్ధి చేస్తున్నాం. మొదటిది ఇనాక్టివేషన్​ పద్దతి, యూఎస్​లోని థామస్​-జెఫర్సన్​తో సంయుక్తంగా కోరో-రాబ్​ అనే విధానంలో రేబీస్​కి, కరోనాకి సంయుక్తంగా ఉత్పత్తి చేస్తున్నాం. రెండోది కో-వ్యాక్సిన్​ పద్దతి, మూడోది నాసిల్​ డ్రాప్స్​ పద్దతిలో చేస్తున్నాం. ఈ మూడింటిలో ఏ పద్దతైనా ఫలితాన్నివ్వొచ్చు, అంతేకాక 130 కోట్ల మంది ప్రజలకు ఒకే రకంగా వ్యాక్సిన్ అందించడం కష్టంతో కూడుకున్న పని. అందుకే విభిన్న రకాలుగా వ్యాక్సిన్​ని అందించాలని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే గ్రామాల్లో కొంతవరకు ఇంజెక్షన్​ చేయలేం. అటువంటప్పుడు నాసల్​ డ్రాప్స్​ ఉపయోగపడతాయి. కొంత మంది రేబీస్​తోనూ పోరాడుతుండొచ్చు. అలాంటి వారికి కోరో-రాబ్​ ఉపయోగపడుతుంది. ఇలా వివిధ రకాల వ్యూహాలతో పని చేస్తున్నాం.

ఈటీవీ భారత్​: కరోనా వైరస్​ జన్యురూపాన్ని మీరు ప్రత్యక్షంగా చూసి ఉంటారు. దాని తీవ్రత ఎలా ఉంది? ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందడానకి గల కారణాలేంటి?

జ. ఏదైనా వైరస్​ జంతువు నుంచి నేరుగా మనిషికి సంక్రమిస్తే అంతగా తీవ్రత ఉండదు. జికా, చికున్​గున్యాలు ఇదే కోవకు చెందినవి. వీటి ప్రభావం అంతగా ఉండదు. వైరస్ ఒక జంతువు నుంచి మరో జంతువుకు, ఆ తరువాత మానవులకు వ్యాప్తి చెందుతుంది. దీనిని జొనాటిక్​ అంటారు. ఈ విధానంలో వైరస్​ వ్యాప్తి నెమ్మదిగా జరుగుతుంది. కానీ ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది. కరోనా విషయంలో ఇదే జరిగింది. దానికితోడు చైనాలో ఉత్పన్నమైన వైరస్​, అక్కడి వారి అంతర్జాతీయ ప్రయాణాలతో ప్రపంచమంతా వ్యాపించింది. చైనా గనక ముందే హెచ్చరించి, అంతర్జాతీయ ప్రయాణాలను నిలువరించి ఉంటే వైరస్​ ఇంతగా వ్యాప్తి చెందేది కాదు. ఈ వైరస్​ కూడా మిగిలిన ఎబోలా లాంటిదే. కానీ గ్లోబల్​ ట్రావెలింగ్స్​ వల్ల ఇంతగా వ్యాపించింది.

ఇవీ చదవండి:నృత్యకళాకారులపై కరోనా ఎఫెక్ట్... ప్రదర్శనలు లేక పాట్లు

Last Updated : Jul 2, 2020, 10:18 AM IST

ABOUT THE AUTHOR

...view details