ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శాసన మండలి రద్దుపై చర్చించిన శాసనసభలో ఎప్పుడు ఏం జరిగింది?

By

Published : Jan 27, 2020, 12:17 PM IST

Updated : Jan 27, 2020, 6:07 PM IST

assembly live page
శాసనసభ సమావేశాలు

17:39 January 27

మండలి రద్దు తీర్మానానికి శాసనసభ ఆమోదం

ముఖ్యమంత్రి జగన్మోహాన్​రెడ్డి ప్రసంగం అనంతరం... మండలి రద్దు తీర్మానంపై శాసనసభలో ఓటింగ్ జరిగింది. తొలుత ఓటింగ్ నిర్వహించినా... సాంకేతిక కారణాల వల్ల... దాదాపు 20 నిమిషాలు లెక్కింపు ఆలస్యమైంది. అనంతరం సీఎం ప్రతిపాధించిన తీర్మానాన్ని సభ అమోదించినట్లు... సభాపతి తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ తీర్మానానికి మద్దతుగా 133 సభ్యులు నిలిచారన్న సభాపతి... వ్యతిరేకం, మధ్యస్థంగా ఎవరూ లేరని తెలిపారు. అనంతరం  అసెంబ్లీని నిరవధిక వాయిదా వేశారు.

17:00 January 27

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మండలి రద్దుకు నిర్ణయం: సీఎం జగన్

 ప్రజా ప్రయోజనాల దృష్ట్యా శాసన మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం జగన్ అన్నారు. శాసనమండలి చేసిన సవరణలు...అమోదించాల్సిన అవసరం శాసనసభకు లేదని పేర్కొన్నారు. సభలు, మండళ్లు ప్రజలకు మంచి చేసేదేలా ఉండాలని...అలా లేనప్పుడు రద్దు చేయడమే మేలని అభిప్రాయపడ్డారు.  ట్రైజరీ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయడానికి ఇలాంటి మండలికి అర్హత లేదన్నారు. ఈ మండలికి ఏడాదికి దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం దండగన్నారు.  శాసనమండలి రద్దుపై ఏకపక్షంగా  నిర్ణయం తీసుకున్నామని అంటారనే... ముందుగా విపక్షాలకు మూడు రోజులు సమయం ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారన్నారు.  తమ పార్టీ నాయకులను కొనుగోలు చేసి...వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చిన గొప్ప రాజనీతిజ్ఞుడు చంద్రబాబు అని  ఎద్దేవా చేశారు. 

16:40 January 27

ఉత్తరాంధ్రను అభివృద్ధిలో ఉరకలెత్తిస్తాం: రాజన్నదొర

 శాసనసభలో అమోదం పొందిన ఎస్సీ, ఎస్టీ, ఆంగ్లమాధ్యమం బిల్లులు... వెనక్కు తిరిగి రావడం దురదృష్టకరమని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. ప్రస్తుతం కేంద్రీకృతమైన పరిపాలనను వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతోనే...మూడు రాజదానులపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారన్నారు. అట్టడుగు వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే... పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్ర ఉసూరుమనకుండా...రాయలసీమ రాళ్లు పారకుండా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉత్తరాంధ్రలోనే గిరిజన ప్రాంతం ఉందన్న రాజన్న... ఆ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  

16:21 January 27

తప్పు చేసిన ఎవరైనా.... ప్రజా తీర్పులో శిక్ష అనుభవించాల్సిందే : మంత్రి సుభాష్ చంద్ర బోస్

రాజకీయాలకతీతంగా ఉండాల్సిన శాసనమండలి...రాజకీయాలకు కేంద్రంగా ఉండడం దురదృష్ణకరమని మంత్రి సుభాష్ చంద్ర బోస్ అన్నారు. శాసనసభకు సూచనలు, సలహాలు  ఇవ్వాల్సిన పెద్దల సభ...వాటికి అతీతంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. న్యాయాధిపతిగా మండలి ఛైర్మన్ వ్యవహరించాలే కానీ... పార్టీల పక్షపాతిగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన ఎవరైనా ప్రజా తీర్పులో  శిక్ష అనుభవించాల్సిందేనని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే...రాష్ట్రానికి రాజధాని ఎంపిక చేయాలని నిర్ణయించామని వ్యాఖ్యానించారు. 

16:07 January 27

పదవుల కన్నా రాష్ట్ర సంక్షేమమే ముఖ్యం: మంత్రి మోపిదేవి

ఏడాదిన్నర క్రితం పాక్ చెరలో ఉన్న మత్స్యకారుల విడుదలకు సీఎం జగన్ కృషి ప్రశంసనీయమని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. పదవులు కన్నా రాష్ట్ర సంక్షేమమే తమకు ప్రధానమన్నారు. ఇండియా టుడేలోనూ అత్తుత్తమ పరిపాలన అందించే ముఖ్యమంత్రిల్లో... సీఎం జగన్ నాలుగో స్థానంలో ఉన్నారని తెలిపారు. పాదయాత్ర చేస్తున్నప్పుడే...ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా వ్యవహరించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నారన్నారు.  చంద్రబాబు స్వార్థపూరిత విధానాల వల్లే రాష్ట్రానికి ఇలాంటి దుర్బర పరిస్థితి దాపరించిందని ఆరోపించారు. 
 

16:01 January 27

శాసనమండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా: రాపాక

శాసనమండలి రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.  ఓ వైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ... మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం జగన్  శ్రీకారం చుడుతున్నారని రాపాక ప్రశంసించారు. 

15:45 January 27

గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు: రోజా

ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ  సీఎం జగన్ నెరవేరుస్తున్నాడని  ఎమ్మెల్యే రోజా అన్నారు.  చంద్రబాబు దగుల్బాచి రాజకీయాలు బయటపడతాయనే... ఇవాళ ఆయన సభకు రాలేదని ఆరోపించారు. గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్టీఆర్​ హాయాంలో వెన్నుపోటు, చంద్రబాబు హాయాంలో పన్నుపోటు చేశారంటూ యనమలపై వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థలను భ్రష్ఠు పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్​ అయితే...యనమల స్టీరింగ్ అని విమర్శించారు. ప్రజా తీర్పును గౌరవించేలా పెద్దల సభ ఉండాలే తప్ప... ఆ తీర్పును అపహాస్యం చేసేలా ఉండకూడదని హితవు పలికారు. 2004లో శాసనమండలి వల్ల ఖర్చు తప్ప ఏం ప్రయోజనం ఉండదన్న చంద్రబాబు... ఇవాళ పెద్దల సభ ఉండాలనడం విడ్డూరంగా ఉందన్నారు. 

15:02 January 27

'ప్రజలకు ఉపయోగపడని శాసనమండలి అవసరంలేదు': చెవిరెడ్డి

'ప్రజలకు ఉపయోగపడే పనులు చేయకుండా.. వ్యక్తులకు ఉపయోగపడే శాసనమండలి మాకు అవసరంలేదు. ముఖ్యమంత్రి జగన్ అనుకుంటే పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మనీ బిల్లుగా పెట్టి ఆమోదింపచేసుకోవచ్చు. అయితే సీఎం అలా అనుకోలేదు. ప్రజాస్వామ్యానికి, చట్టసభలకు విలువిచ్చి బిల్లును పెద్దలసభకు పంపిస్తే.. వారు దాన్ని సెలక్ట్ కమిటీకి పంపడం అన్యాయం. ప్రజలకు ఉపయోగపడే బిల్లులను ఆమోదించని ఎగువసభ ఎవరికీ అవసరం లేదు. అందుకే శాసనమండలి రద్దుకు నా పూర్తి మద్దతు తెలియజేస్తున్నాను.' ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి అన్నారు.  

14:05 January 27

సీఎం జగన్ ఉన్నతిని చూడలేకే ఉద్యమాలు: పార్ధసారథి

'అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలెన్నో చేపట్టారు. ప్రజాసంక్షేమ పథకాలు అమలుచేశారు. పరిపాలనను ప్రజలకు చేరువ చేశారు.  ఆ ఉన్నతిని చూడలేకే ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు చిన్న అంశాన్ని పట్టుకుని రభస చేస్తున్నారు. 29 గ్రామాల ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలు చేయిస్తున్నారు. రాజకీయ కారణాలతోనే మూడు రాజధానులను అడ్డుకుంటున్నారు. కావాలనే శాసనసభ తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. శాసనమండలిలో ఆధిక్యాన్ని అడ్డుపెట్టుకుని ప్రజా సంక్షేమం కోసం తీసుకువచ్చిన బిల్లులను అడ్డుకున్నారు. అమరావతిలో తాము కొన్న భూములను కాపాడుకోవడానికే మూడు రాజధానులకు తెదేపా నేతలు ఒప్పుకోవడంలేదు. దుర్బుద్ధితో అమరావతిలో 4వేలకు పైగా ఎకరాలను గ్రీన్​జోన్​గా ప్రకటించారు. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. అందుకే బిల్లులను అడ్డుకుంటున్న మండలి రద్దుకు పూర్తి మద్దతు తెలుపుతున్నాను' అని ఎమ్మెల్యే పార్ధసారథి అన్నారు. 

13:36 January 27

మేమంతా సీఎం వెంటే ఉంటాం: పేర్ని నాని

పేర్ని నాని

'శాసన మండలి నిర్మాణం పట్ల, కూర్పు పట్ల నాకు గౌరవ అభిప్రాయం ఉంది. శాసనసభ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. లోటుపాట్లను చర్చించి సూచనలు, సలహాలు ఇవ్వడమే మండలి ఉద్దేశం. అయితే.. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేరడంలేదు. సీఎం జగన్ కీర్తి ప్రతిష్టలు పెరగకూడదనే ఉద్దేశంతోనే తెదేపా నేతలు బిల్లులకు అడ్డుపడుతున్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ఎవరెన్ని అడ్డంకులు ఏర్పరిచినా.. సీఎం తీసుకుంటున్న ప్రజాయోగ్యమైన నిర్ణయాలను ఆచరణలో పెట్టకుండా అడ్డుకోలేరు. మేమంతా ముఖ్యమంత్రి వెంటే ఉంటాం. శాసనమండలిపై చంద్రబాబు అప్పుడొక మాట, ఇప్పుడొక మాట మాట్లాడుతున్నారు. మూడు రాజధానుల వల్ల అమరావతికి ఎలాంటి నష్టం జరగదు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న సదుద్దేశంతో రూపొందించిన బిల్లులను అడ్డుకుంటున్న శాసనమండలి కొనసాగాల్సిన అవసరం లేదు'  అని మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు.

12:53 January 27

మండలి రద్దు వద్దంటే.. ప్రజాతీర్పును వ్యతిరేకించినట్లే: ధర్మాన

ధర్మాన ప్రసాదరావు

'మొన్నటి ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో వైకాపాను ప్రజలు గెలిపించారు. పూర్తి ఆధిపత్యంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 151 మంది ఎమ్మెల్యేలు శాసనసభలో చర్చించి.. అందరి సంక్షేమం కోసం తీసుకొచ్చిన బిల్లులను అడ్డుకోవాలని చూస్తున్నారు. అది 151 మంది నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజాతీర్పును వ్యతిరేకించినట్లే. ప్రజలచే ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయాన్ని.. ప్రజలు తిరస్కరించిన వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. దేశంలో 6 రాష్ట్రాల్లో మాత్రమే ఎగువసభలు ఉన్నాయి. అవీ బ్రిటీషర్లు ఏర్పాటుచేసినవి. మన స్వాతంత్య్ర సమరయోధులెవరూ శాసనమండలిని సమర్థించలేదు. కొంతమంది సభ్యులు శాసనమండలిని ప్రభావితం చేస్తుంటే.. ఇంక మండలి అర్ధం ఏముంది. మండలి ఛైర్మన్ ఒత్తిళ్లకు లొంగి బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. అందుకే శాసనమండలిని రద్దు చేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఎగువసభ ఉన్న ఉద్దేశం నెరవేరనప్పుడు అది కొనసాగాల్సిన అవసరం లేదు.' అని శాసనసభ చర్చల్లో  మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

12:43 January 27

12:17 January 27

'శాసనమండలిలో అన్యాయంగా బిల్లులను అడ్డుకున్నారు'

'గత ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిని విస్మరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారు. అయితే దానికి తెదేపా అడ్డుపడుతోంది. అమరావతి ప్రాంతంలో ఇన్​సైడర్ ట్రేడింగ్ చేసి వారి భూములను కాపాడుకోవడానికే తెదేపా నేతలు అమరావతి జపం చేస్తున్నారు.  శాసనమండలిలో అన్యాయంగా బిల్లులను అడ్డుకున్నారు. చంద్రబాబునాయుడు తన స్థాయిని కూడా మర్చిపోయి.. గ్యాలరీలో కూర్చొని శాసన మండలిని ప్రభావితం చేసి.. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపేలా చేశారు. అమరావతిని రాజధానిగా చేసే సమయంలో చంద్రబాబు శివరామకృష్ణన్ కమిటీ సూచనలను పట్టించుకోలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని శాసనమండలి రద్దు తీర్మానానికి మద్దతు ఇవ్వాలి. శాసన మండలి అన్నది శాసనసభకు సూచనలు, సలహాలు ఇచ్చేదిగా ఉండాలి. అయితే.. అది నెరవేరడం లేదు. శాసనసభ ఆమోదించిన ప్రతి బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారు.  అందుకే శాసనమండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నాం. ' అని మంత్రి ఆళ్ల నాని శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా అన్నారు.

12:07 January 27

శాసన మండలి రద్దుపై చర్చిస్తున్న శాసనసభ

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ శాసనమండలి రద్దు ప్రతిపాదన తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దీనిపై శాసనసభలో చర్చ నడుస్తోంది. 

Last Updated : Jan 27, 2020, 6:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details