దాదాపు 50 రోజుల నుంచి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన వైఎస్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన వైఎస్ షర్మిల.. ఖమ్మం నగరంలో భారీ సభకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 9న ఖమ్మం నగరంలోని పెవిలియన్ మైదానంలో జరిగే బహిరంగ సభకు... ఆమె అనుచరగణం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉభయ జిల్లాల్లోని 10 నియోజకవర్గాల నుంచి భారీగా వైఎస్ అభిమానులను తరలించేలా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10నియోజకవర్గాలకు బాధ్యులను ఇప్పటికే నియమించారు. బహిరంగ సభకు భారీగా జనసమీకరణ చేయడంతోపాటు.. సభను విజయవంతం చేసేందుకు గానూ నియోజవర్గ బాధ్యులు కసరత్తులు చేస్తున్నారు.
అడ్డొస్తున్న కొవిడ్ నిబంధనలు..
ఈ నెల 9న సాయంత్రం 5 గంటల నుంచి... రాత్రి 9 గంటల వరకు బహిరంగ సభ నిర్వహించుకునేందుకు ఇప్పటికే ఖమ్మం పోలీసులు అనుమతి ఇచ్చారు. కేవలం 5 నుంచి 6 వేల మంది వరకు సభలో పాల్గొనేలా... పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆంక్షలు విధించారు. బహిరంగ సభలో ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సూచించారు. నిబంధనలు అంగీకరించి సభ నిర్వహణ కోసం సమాయత్తమవుతున్న తమకు.. కరోనా నిబంధనల పేరుతో అడుగడుగునా ఆంక్షలు విధిస్తున్నారని షర్మిల పార్టీ వ్యవహారాల బాధ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం రోజుకో రకమైన ఇబ్బందులకు గురి చేస్తుందని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సంకల్ప సభ నిర్వహించి విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే సభను జరుపుతామని.. ఇందుకోసం 500 మంది వాలంటీర్లను నియమించినట్లు చెప్పారు. షర్మిల ఖమ్మం గడ్డపై అడుగుపెడుతుందంటేనే.. తమ పునాదులు కదులుతాయని కొందరు భయపడుతున్నారని.. అందుకే సభకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.