ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంలో భాగంగా ఆ సంస్థ కార్మికులు ప్రజారవాణా శాఖలోకి మారనున్నారు. కొత్త శాఖ ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. ఈ వారంలోనే దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జనవరి ఒకటిన అధికారంగా ఆర్టీసీ కార్మికులను అందులోకి మారినట్లు చూపనున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఆర్టీసీ కార్మికుల విలీనానికి సంబంధించిన బిల్లుకు ఉభయసభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలుత గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆ తర్వాత ప్రజారవాణా శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులివ్వనుంది. దీంతో కొత్త శాఖ ఏర్పాటు ఆరంభమవుతుంది. అనంతరం ఏపీఎస్ఆర్టీసీలోని 51,488 కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తారు.
హోదాల మార్పు ఇలా..
ప్రస్తుతానికి ఆర్టీసీలో ఉన్నతాధికారుల హోదాలు మాత్రమే ప్రజా రవాణాశాఖలో మారుతాయి. ఆర్టీసీలో ప్రస్తుతం డిపో మేనేజర్ (డీఎం), డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, రీజనల్ మేనేజర్ (ఆర్ఎం), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ), మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) వరకు హోదాలు ఉన్నాయి. ప్రజా రవాణశాఖల్లో వారి హోదాలు వరుసగా అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్, కమిషనర్గా మారనున్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు ప్రజా రవాణాశాఖలో కూడా అదే పేరుతో కొనసాగనున్నారు. జనవరి ఒకటిన విలీనం జరగనుండగా, ఆర్టీసీ ఉద్యోగులకు ఫిబ్రవరి ఒకటిన ట్రెజరీ ద్వారా జీతం అందనుంది.