ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 14, 2020, 4:18 PM IST

Updated : Sep 15, 2020, 6:05 AM IST

ETV Bharat / city

పోలీసులను డీజీపీ నియంత్రించలేరా?: హైకోర్టు

పోలీసు వ్యవస్థ తీరుపై హైకోర్టు మరోసారి.. అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా.. ఏపీలో రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని మండిపడింది. గతంలో డీజీపీ హైకోర్టు ఎదుట హాజరైనా.. పరిస్థితి మారలేదని వ్యాఖ్యానించింది.

ap-hihg-court-fires-on-police-department
ap-hihg-court-fires-on-police-department

రాష్ట్రంలో పోలీసు అధికారులను నియంత్రించలేని స్థితిలో డీజీపీ ఉన్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. నియంత్రించే సమర్థత లేకపోతే డీజీపీ రాజీనామా చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా చూసుకుంటామని గతంలో కోర్టుకు హాజరై డీజీపీ ఇచ్చిన హామీ ఏమైందని నిలదీసింది. ఆ హామీ ప్రకారం చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎవరినైనా ఎత్తుకెళ్లిపోవడం ఏపీ పోలీసులకు అలవాటుగా మారిందని అసహనం వ్యక్తం చేసింది. పోలీసుల తీరు ఇలాగే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడటం ఖాయమని హెచ్చరించింది. సక్రమంగా మసులుకునేలా సర్కారుకు సూచించాలని ప్రభుత్వ న్యాయవాదికి స్పష్టం చేసింది. పోలీసుల తీరుపై ప్రతి కేసును సీబీఐ, మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించలేమని పేర్కొంది. ఇప్పటికే మూడు విషయాల్లో మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశిస్తే.. వాటన్నింటిలోనూ పోలీసులు నేరస్థులని తేలిందని వెల్లడించింది. రాష్ట్రంలో ప్రాథమిక హక్కులున్నాయా అంటూ మండిపడింది. ఓ వ్యక్తిని అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన వ్యాజ్యంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యాజ్యవిచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.

పిటిషనర్ తరఫు న్యాయవాది

తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు
తూర్పుగోదావరి జిల్లా ఇందుపల్లి గ్రామానికి చెందిన తన మేనమామ పి.వెంకటరాజును అమలాపురం పట్టణ ఠాణా పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన్ను కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని కోరుతూ సుంకర నారాయణస్వామి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేశారు. ఆయన తరఫున న్యాయవాది శశాంక భువనగిరి వాదనలు వినిపిస్తూ.. ‘అమలాపురం పట్టణ పోలీసులు పిటిషనర్‌ తండ్రి వెంకట గంగాకృష్ణకు ఈ నెల 4న ఫోన్‌ చేసి స్టేషన్‌కు రావాలన్నారు. పిటిషనర్‌, ఆయన తండ్రి స్టేషన్‌కు వెళ్లారు. తన భార్య కనిపించడం లేదని, పిటిషనర్‌ తమ్ముడితో వెళ్లిందంటూ విశాఖ జిల్లాలో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారని అమలాపురం సీఐ ఎస్‌కే బాజీలాల్‌ వారికి చెప్పారు. పిటిషనర్‌ సోదరుడు ఎక్కడున్నాడని ఆరా తీశారు. దీని గురించి తమకేమీ తెలియదని వారు చెబుతున్నా వినకుండా సీఐ దుర్భాషలాడారు. తప్పుడు కేసులు పెడతామని బెదిరించారు. ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. దీనిపై పిటిషనర్‌ ఈ నెల 7న జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదే వ్యవహారంలో పిటిషనర్‌ మేనమామ వెంకటరాజును 6వ తేదీ రాత్రి అమలాపురం పట్టణ పోలీసులు తీసుకెళ్లారు. అరెస్ట్‌ చూపకుండానే ఆయన్ను విశాఖపట్నానికి పంపారు. రాజకీయ ప్రభావంతో సీఐ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు’ అని వివరించారు.

వ్యాజ్యం వేశాకే వదిలిపెట్టారు
ప్రభుత్వ న్యాయవాది (జీపీ) వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ‘విశాఖపట్నం మల్కాపురం ఠాణాలో మహిళ అదృశ్యం కేసు నమోదయింది. ఆ వ్యవహారంలో సీఆర్‌పీసీ 160 ప్రకారం వెంకటరాజుకు 6వ తేదీన నోటీసిచ్చాం. 7న మల్కాపురం ఠాణాలో హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన పోలీసుల నిర్బంధంలో లేరు. వదిలిపెట్టాం’ అన్నారు. పిటిషనర్‌ న్యాయవాది స్పందిస్తూ.. తాము వ్యాజ్యం దాఖలు చేశాకే వెంకటరాజును వదిలిపెట్టారన్నారు. కేసుతో సంబంధం లేని దూరపు బంధువును తీసుకెళ్లి పోలీసులు ఇబ్బందిపెట్టడమేమిటన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పోలీసుల తీరుపై ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఎవరైనా ఎత్తుకెళ్లిపోవడం ఏపీ పోలీసులకు అలవాటుగా మారిందని మండిపడింది.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా జోరుగా వర్షాలు

Last Updated : Sep 15, 2020, 6:05 AM IST

ABOUT THE AUTHOR

...view details