ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 8, 2020, 8:27 AM IST

ETV Bharat / city

వృద్ధులకు రాయితీలిచ్చి గౌరవిస్తే సరిపోదు..: హైకోర్టు

వృద్ధులకు బస్సు, రైళ్లు, విమాన ప్రయాణాల్లో రాయితీలు, రైళ్లలో కింది బెర్త్​లు, బస్సుల్లో సౌకర్యవంతమైన సీట్లు కేటాయింపుతో ఇచ్చే గౌరవం సరిపోదని హైకోర్టు స్పష్టం చేసింది. వారికి సంబంధించిన వ్యాజ్యాల్ని సత్వర విచారణ జరిపి త్వరితగతిన చట్టబద్ధమైన హక్కుల్ని, ఫలాల్ని పొందేలా చేయడమే నిజమైన గౌరవం ఇచ్చినట్లని పేర్కొంది.

Ap high court comments on senior citizens petitions
ఏపీ హైకోర్టు

వృద్ధులకు ప్రయాణాల్లో రాయితీలు, రైళ్లలో కింది బెర్త్‌లు, బస్సుల్లో సీట్ల కేటాయింపు ద్వారా ఇస్తున్న గౌరవం సరిపోదని హైకోర్టు అభిప్రాయపడింది. వారికి సంబంధించిన వ్యాజ్యాలపై సత్వర విచారణ జరిపి... చట్టబద్ధమైన హక్కుల్ని, ఫలాల్ని పొందేలా చేయడమే నిజమైన గౌరవం ఇచ్చినట్లని పేర్కొంది. వృద్ధులకు చెందిన సివిల్‌, క్రిమినల్‌, సర్వీసు, ఇతర అంశాలకు సంబంధించిన వ్యాజ్యాల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉందని చెప్పింది. వారు జీవించివున్న కాలంలోనే వ్యాజ్య ఫలాలు దక్కేలా చూడాలని తెలిపింది.

వయో వృద్ధులైన ఇద్దరు పిటిషనర్లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను సాధ్యమైనంత త్వరగా, గరిష్ఠంగా రెండు నెలల్లోపు పరిష్కరించాలని విజయవాడలోని రెండో అదనపు జిల్లా కోర్టును ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఈమేరకు తీర్పు ఇచ్చారు. ఓ ఇంటి విషయంలో కింది కోర్టు 2010లో ఇచ్చిన తీర్పు ప్రకారం... తమకు రావాల్సిన ప్రయోజనాల్ని మదింపు చేసేందుకు 'అడ్వొకేట్‌ కమిషనర్‌'ను నియమించాలని కోరుతూ విజయవాడ రెండో అదనపు జిల్లా కోర్టులో పి.వెంకట హనుమంత కృష్ణమూర్తి శర్మ(80), వెంకట ఉదయ్‌ ప్రభాకర్‌ శర్మ(72) 2011లో అనుబంధ పిటిషన్‌ వేశారు. దాన్ని న్యాయస్థానం పరిష్కరించకపోవడంతో ఈ ఏడాది నవంబర్లో హైకోర్టును ఆశ్రయించారు. అనుబంధ పిటిషన్‌ను పరిష్కరించేలా కింది కోర్టును ఆదేశించాలని కోరారు. పిటిషనర్ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ప్రపంచ వయో వృద్ధుల సంవత్సరం సందర్భంగా 1999లో.. 65 ఏళ్ల పైబడిన వారి వ్యాజ్యాల్ని ప్రాధాన్య క్రమంలో విచారించాలని న్యాయాధికారుల్ని కోరుతూ అప్పటి ఉమ్మడి ఏపీ హైకోర్టు ఓ సర్క్యులర్‌ ఇచ్చిందని గుర్తుచేశారు. అయినప్పటికీ వయో వృద్ధుల వ్యాజ్యాల పరిష్కార సంఖ్య తగ్గడం లేదన్నారు. ప్రస్తుత కేసులో... సరైన కారణం లేకుండా తొమ్మిదేళ్లుగా దిగువ కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని ఆక్షేపించారు. న్యాయస్థానాలు తమ ముందున్న కేసుల్ని వేగంగా పరిష్కరించి కక్షిదారుల హక్కుల్ని రక్షించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details