ప్రభుత్వ భూముల వేలాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా.... హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్కుమార్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. మనసును తొలచిన దాన్ని బహిరంగంగా ప్రశ్నించడం తనకు అలవాటని.... దానిపై స్పష్టత ఇస్తే సరిపోతుందన్నారు. అంతే తప్ప దాన్ని దృష్టిలో ఉంచుకుని పిటిషన్లు వేయడం సరికాదన్నారు. 1983 నుంచి న్యాయవాదిగా 26 ఏళ్లకుపైగా ప్రాక్టీసు చేశానని.... 2009లో హైకోర్టు జడ్జిగా నియమించినప్పటి నుంచి శక్తిసామర్థ్యాల మేరకు విధులు నిర్వహిస్తున్నానని చెప్పారు. పాట్నా హైకోర్టులో జడ్జిగా పనిచేసినప్పుడు... వాదనలు వినిపించేవారు సీనియర్ న్యాయవాదా..జూనియరా అనే వ్యత్యాసం ఎన్నడూ చూపలేదన్నారు. కారణం ఏదైనా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చానని.... పదవీ విరమణకు ముందు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నానని ఆవేదన చెందారు. ఏదేమైనా ఊపిరి ఉన్నంత వరకు న్యాయ వ్యవస్థను కాపాడతానని స్పష్టం చేశారు.
బరువెక్కిన హృదయంతోనే పిటిషన్: ఏఏజీ
ఈ వ్యాజ్యాలపై వాదనలు వినిపించిన అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి... విచారణ నుంచి తప్పుకోవాలంటూ బరువెక్కిన హృదయంతో ప్రభుత్వం తరఫున అనుబంధ పిటిషన్ వేశామన్నారు. వేసిన అధికారి కేడర్ ఏంటని ధర్మాసనం ప్రశ్నించగా... మిషన్ బిల్డ్ ప్రత్యేక అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఐఎఎస్ అధికారని తెలిపారు. పదవీ విరమణ తర్వాత ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారా అని అడగ్గా... యువ ఐఎఎస్ అని ఏఏజీ తెలిపారు. ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బాధ్యతలు నిర్వహించకుండా... కొందరు వ్యాజ్యాలు వేసి అడ్డుకుంటున్నారని వాదించారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాతీర్పుతోనే అధికారంలోకి వస్తుందన్న ధర్మాసనం.... ప్రజలు పూర్తిస్థాయిలో మ్యాండేట్ ఇస్తే న్యాయవ్యవస్థ విధులు నిర్వహించాల్సిన అవసరం లేదనుకుంటున్నారా..? అని ప్రశ్నించింది. ప్రజలందరి బాగోగులు మేమే చూసుకుంటామని, ఎలాంటి పిటిషన్లయినా దాఖలు చేసే హక్కు ప్రభుత్వానికి ఉందని చెప్పాలనుకుంటున్నారా అని ధర్మాసనం అడగ్గా.... లేదని ఏఏజీ బదులిచ్చారు.