ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 16, 2020, 2:55 AM IST

Updated : Jun 16, 2020, 6:50 AM IST

ETV Bharat / city

రైతు సంక్షేమానికి పెద్దపీట.. 8.16 శాతం వృద్ధి అంచనా..!

రైతులు, నిరుపేదల సంక్షేమం, విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నవరత్నాల అమలుతో పేదల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలో తెలిపింది. 2019-20లో 8.16 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది.

రైతు సంక్షేమానికి పెద్దపీట.. 8.16 శాతం వృద్ధి అంచనా..!
రైతు సంక్షేమానికి పెద్దపీట.. 8.16 శాతం వృద్ధి అంచనా..!

2019-20 సామాజిక ఆర్థిక సర్వేని సాంప్రదాయానికి భిన్నంగా శాసనసభలో ప్రవేశపెట్టక ముందే ప్రభుత్వం విడుదల చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఆ సర్వేని ఆవిష్కరించారు. ప్రస్తుత లెక్కల ప్రకారం రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.9,72,782 కోట్లుగా సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. గత ఏడాదితో పోలిస్తే 12.73 శాతం వృద్ధి నమోదవుతుందని... అంటే దాదాపు రూ.1,100 కోట్లు ఎక్కువని ప్రణాళిక విభాగం తెలిపింది.

8.16 శాతం వృద్ధి

నవరత్నాల్లో భాగంగా విద్య, వైద్యం, సామాజిక భద్రత, రైతులు, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యంగా పేర్కొంది. మొత్తంగా రాష్ట్ర వృద్ధి 8.16 శాతం ఉండవచ్చని సర్వేలో తెలిపింది. స్థిర ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 6 లక్షల 72 వేల 18 కోట్ల రూపాయలుగా ఉండవచ్చని వివరించింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగి... లక్షా 69 వేల 519 రూపాయలుగా ప్రణాళిక విభాగం తెలిపింది.

  • రంగాల వారీగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి(ముందస్తు అంచనాలు రూ.కోట్లలో)
ప్రస్తుత ధరల ప్రకాం స్థిర ధరల ప్రకారం గతేడాదితో పోలిస్తే వృద్ధి శాతం
వ్యవసాయం 3,20,218 1,86,393 18.96
పారిశ్రామికం 1,91,857 1,54,627 5.67
సేవలు 3,67,747 2,62,772 9.11

సేవలకు చిరునామా..

పౌరసేవలు, ఫిర్యాదులను 72 గంటల్లో పరిష్కరించేలా స్పందన కార్యక్రమం చేపట్టినట్లు సామాజిక ఆర్థిక సర్వేలో ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ సేవలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని, 541 పౌరసేవలను అందిస్తున్నామని వెల్లడించింది.

పరిశ్రమల ఏర్పాటుతో 1.17 లక్షల మందికి ఉపాధి

రామాయపట్నం, భావనపాడు, మచిలీపట్నం పోర్టుల నిర్మాణంతో పాటు... రూ.18,691 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆస్కారం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్స్​ రంగంలో రూ.30,656 కోట్ల పెట్టుబడులతో 1.07 లక్షల మందికి ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుతూ తీసుకున్న నిర్ణయంతో... 51,788 ఉద్యోగులకు లబ్ధి చేకూరినట్లు తెలిపింది. మద్య నియంత్రణలో భాగంగా 43 వేల బెల్టు దుకాణాలు, 4,380 పర్మిట్‌ రూములు రద్దు చేసినట్లు సర్వేలో పేర్కొంది.

ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలు

  • వైఎస్సార్​ ఆరోగ్యశ్రీలో 2.70 లక్షల మందికి ప్రయోజనం.
  • వైఎస్సార్​ కంటివెలుగులో 60,406 పాఠశాలల్లోని 66 లక్షల మందికి కంటి పరీక్షలు.
  • 2019 - 20లో 54.68 లక్షల మందికి పింఛన్లు. ఏడాదికి రూ.15,635 కోట్లు కేటాయింపు. 2020 - 21లో ఈ పథకానికి కేటాయింపులు రూ.18 వేల కోట్లకు పెంపు
  • విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల సరఫరా కోసం 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు. 46 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రూ.6,534 కోట్ల పెట్టుబడి సాయం అందజేత.
  • ఖరీఫ్​లో 21.53 లక్షల మంది రైతులకు ఉచిత పంటల బీమా. రూ.1,270 కోట్ల ప్రీమియం చెల్లింపు.
  • ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల ఆర్థిక సాయం. మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షల సాయం.
  • జలయజ్ఞంలో ప్రాజెక్టుల పూర్తికి కార్యాచరణ.
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 29 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ. ఏడాదికి 7.5 లక్షల చొప్పున వచ్చే నాలుగేళ్లలో ఇళ్ల నిర్మాణం. 2020-21లో 15 లక్షల ఇళ్ల నిర్మాణం.
  • వైఎస్సార్​ చేయూతలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మహిళలకు రూ.75 వేల ఆర్థిక సహాయం.
  • వైఎస్సార్​ నేతన్న నేస్తం ద్వారా 81,779 కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున రూ.196.27 కోట్లు చెల్లింపు.
  • వైఎస్సార్​ వాహనమిత్ర ద్వారా 2.62 లక్షల మంది ఆటో, ట్యాక్సీ, క్యాబ్​ యజమానులకు ఏడాదికి రూ.10 వేలు చెల్లింపు.
  • మనబడి నాడు - నేడు కింద 15,715 పాఠశాలల్లో దశల వారీగా మౌలిక సదుపాయాల మెరుగుదలకు కార్యాచరణ. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ద్వారా బోధనకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • అమ్మఒడి కింద 42.33 లక్షల మంది విద్యార్థుల తల్లులకు రూ.15 వేల చొప్పున రూ. 6,336 కోట్లను ఖాతాల్లో జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇదీ చూడండి..

ఎస్​ఈసీ పునర్​నియామకంపై సుప్రీంలో మరో పిటిషన్ దాఖలు

Last Updated : Jun 16, 2020, 6:50 AM IST

ABOUT THE AUTHOR

...view details