ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 8, 2021, 11:03 PM IST

ETV Bharat / city

ఆలయాలపై దాడుల పర్వం... 'సిట్​'తో చెక్ పెట్టేందుకు సర్కార్ సన్నద్ధం

రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులతో ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక చోట ఆలయంపై దాడి జరుగుతుండటంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం కేసులో సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సెప్టెంబరు నుంచి జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులను ఈ బృందం దర్యాప్తు చేయనుంది. మరోవైపు అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు వేసి, పర్యవేక్షణ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

cm jagan
cm jagan

దేవాలయాల వేదికగా నడుస్తోన్న రాజకీయాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆలయాల్లో వరుసగా జరుగుతున్న దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్​)ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అ.ని.శా. ఏడీ అశోక్‌కుమార్‌ సారథ్యంలో 16 మంది అధికారులతో సిట్‌ ఏర్పాటైంది. సెప్టెంబరు నుంచి జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులను సిట్‌ దర్యాప్తు చేయనుంది. దాడులపై దర్యాప్తు చేసి కోర్టుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఈ బృందానికి సర్కార్ సూచించింది. దీనితోపాటు అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు వేసి, పర్యవేక్షణ చేయాలని నిర్ణయించింది.

శుక్రవారం సచివాలయంలో మతసామరస్య కమిటీ సమావేశం జరిగింది. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాషా... వివిధ మతాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. జిల్లాల స్థాయిలో అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి బొత్స ప్రకటించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని దుష్ట శక్తులు ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. జన సంచారం లేని ఆలయాలపై‌ దాడులు చేసి ప్రజల్లో అలజడి సృష్టించడానికి సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

ఆలయాలపై దాడులు..

ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్​లో ఆలయాలపై దాడుల ఘటనలు అగ్గి రాజేస్తున్నాయి. ఈ ఆంశం రాజకీయ రంగు పులుముకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పరం వాగ్బాణాలు సంధిస్తున్నాయి. సాధారణంగా గుప్తనిధుల అన్వేషణ, ఆభరణాల చోరీ, విగ్రహాల స్మగ్లింగ్‌ కోసం దేవాలయాలపై దాడులు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అలాంటివి కాదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. దాడులు జరిగిన ఆలయాలు అంత పురాతనమైనవి కూడా కాదు. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లుగా ఉందని కొన్ని ధార్మిక సంస్థలు చెబుతున్నాయి.

గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పలు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాల ధ్వంసంతో మొదలై విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం వరకూ దాదాపు 150 ఘటనలు ఏపీలో జరిగాయి. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథం, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాలు దగ్ధం కావడం, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి రథం వెండి సింహాలు మాయం ఘటనలు ప్రజల్లో ఆందోళన పెంచాయి.

రాజకీయ రగడ

రాష్ట్రంలో ఆలయాల దాడులపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, భాజపా, జనసేన పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసంతో ఈ రాజకీయ రగడ మరింత ముదిరింది. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోలీసుల అడ్డంకుల మధ్య రామతీర్థం పర్యటన చేయడం... భాజపా నేతల పర్యటనను పోలీసులు అడ్డుకోవటంతో ఆందోళనలు మరింత పెరిగాయి. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

తెర వెనుక ఉన్నదెవరు?

ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేయిస్తున్నారు? వంటి ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల వద్ద సమాధానం లేదు. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో... స్వామి ఒంటి మీది వెండి ఆభరణాల జోలికి పోలేదు. రాష్ట్రంలో ధ్వంసానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఎన్నెన్నో ఉదంతాల్లో జరిగింది ఇదే. దీన్ని బట్టి ఈ పనులు చేస్తున్నవారి ఉద్దేశం సుస్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా నిందితులను పట్టుకోకపోవడం మరిన్ని ఘటనలు జరిగేందుకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి.

నిఘా ఏది?

అంతర్వేది ఘటన తర్వాత అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ, పోలీసు శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కొన్ని ఆలయాల్లో ఈ సౌకర్యం సమకూర్చినా చాలా ఆలయాలు నేటికీ సీసీ కెమెరాల నిఘాకు దూరంగా ఉన్నాయి. తాజా పరిమాణాలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్​కు ఆదేశించారు. ప్రతి ఒక్క దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయటంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు.

భక్తుల్లో ఆందోళన

ఆలయాలపై దాడుల ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినా... విగ్రహాల విధ్వంసం కొనసాగుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంటోంది. బాధ్యులను త్వరితగతిన గుర్తించి... ఘటనల వెనుక ఉన్నదెవరో కనిపెట్టాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి

4 దశల్లో పంచాయతీ ఎన్నికలు..షెడ్యూల్‌ విడుదల

ABOUT THE AUTHOR

...view details