ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 1, 2022, 8:27 AM IST

Updated : Jun 2, 2022, 3:53 AM IST

ETV Bharat / city

"కొత్తచోట నిర్మాణాలొద్దు.. పాత రిసార్ట్స్‌ ఉన్నచోటే కట్టుకోండి"

Rushikonda excavations: విశాఖ రుషికొండ తవ్వకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వాదనలు విన్న సుప్రీంకోర్టు గతంలో రిసార్ట్‌ ఉన్న ప్రాంతంలోనే నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించింది. అవసరం అనుకుంటే హైకోర్టు మరో కమిటీ నియమించుకోవచ్చని తెలిపింది. తవ్వకాలపై ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలతో ధర్మాసనం విభేదించింది. ప్రతివాదిగా ఉన్న రఘురామ హైకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేసింది.

Rushikonda excavations
రుషికొండ తవ్వకాలపై సుప్రీంకు ప్రభుత్వం

Rushikonda excavations: ‘దేశ ఆర్థిక ప్రగతి కోసం అభివృద్ధి అవసరం. అదే సమయంలో పర్యావరణ పరిరక్షణా అంతే ముఖ్యం. భవిష్యత్తు తరాలకు కాలుష్యం లేని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. అందువల్ల రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు తదుపరి నిర్ణయం వెలువరించేంత వరకూ పాత భవనాలు ఉన్నచోటే నిర్మాణ పనులు చేపట్టాలి. కొండపై తాజాగా తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఇదివరకు భవనాలున్న ప్రాంతంతోపాటు, మైదాన ప్రాంతంలో కట్టుకోవచ్చు.’- సుప్రీం కోర్టు

‘ఫొటోలు చూస్తే కొండను నిలువునా తవ్వినట్లుగా ఉంది తప్పితే ఎక్కడా పాత నిర్మాణ శకలాలు కనిపించలేదు’.- జస్టిస్‌ గవాయ్‌

‘పాత స్థలంలోనే నిర్మిస్తున్నట్లయితే కొత్త భవన నిర్మాణ ప్రాంతానికి సంబంధించిన అక్షాంశాలు, రేఖాంశాలను కొత్తగా ఎందుకు చెప్పారు?’ - జస్టిస్‌ హిమా కోహ్లి

విశాఖ తీరంలోని రుషికొండలో కొత్తగా తవ్విన ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు ఆదేశించింది. ‘10, 20 ఏళ్ల క్రితం తవ్వకాలు జరిపి ఉంటే దాని గురించి మేం పట్టించుకోం. ఫొటోల్లో చూస్తే ఇటీవల తవ్వినట్లే కనిపిస్తోంది. అందువల్ల అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదు’ అని పేర్కొంది. రుషికొండలో నిర్మాణాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం విచారించింది. హైకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా గ్రీన్‌ ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టడం సరికాదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఈ అంశంపై హైకోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసేంత వరకూ నిర్మాణాలను కేవలం పాత భవనాలున్న ప్రాంతానికే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ‘మా అభిప్రాయం ప్రకారం భౌగోళిక పరిధి విషయంలో ఏ ట్రైబ్యునల్‌ అయినా సంబంధిత హైకోర్టుకు సబార్డినేట్‌కిందే లెక్క. అందువల్ల హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసిన ఈ అంశంపై ఎన్జీటీ విచారణ సరికాదు. అందువల్ల ఎన్జీటీ ముందున్న విచారణను నిలిపేస్తున్నాం. అయితే ప్రస్తుత నిర్మాణ పనుల్లో విచ్చలవిడిగా ఉల్లంఘనలు జరుగుతున్నట్లు రఘురామకృష్ణరాజు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నందున ఆ అంశాలను హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి అనుమతిస్తున్నాం’ అని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పష్టంచేశారు. కక్షిదారులంతా తమ అభిప్రాయాలను హైకోర్టుకు నివేదించవచ్చని సూచించారు.

ఇప్పటికే కోర్టు ధిక్కరణ నోటీసులు..

అంతకుముందు రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. రుషికొండపై రిసార్ట్స్‌ నిర్మాణానికి అనుమతులు తెచ్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆ కొండ సహజ రూపాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. తాము మంగళవారం కొత్త ఫొటోలు తీయించామని, ఇప్పటికే కొండను భారీగా తవ్వేశారని, ఇంకా అనుమతిస్తే కొండ పిండయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. కొండను చదును చేసి రిసార్ట్స్‌ నిర్మిస్తున్నట్లు ఫొటోలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఈ నిర్మాణాలపై ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేయగా.. కోర్టు నోటీసులు జారీచేసిందని చెప్పారు. జస్టిస్‌ గవాయ్‌ జోక్యం చేసుకుంటూ.. ఒకవేళ వాళ్లు కోర్టు ధిక్కరణకు పాల్పడితే హైకోర్టు జైలుకు పంపుతుందని స్పష్టం చేశారు. ఈ విషయమై మీరు వెంటనే హైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. అందుకు న్యాయవాది స్పందిస్తూ ఆలోపే ప్రభుత్వం కొండను మొత్తం చదును చేసేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు

9 ఎకరాల్లోనే నిర్మాణాలు..

ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిసిస్తూ.. అక్కడ రిసార్ట్స్‌ 2006 నుంచే ఉన్నాయని చెప్పారు. జస్టిస్‌ గవాయ్‌ జోక్యం చేసుకుంటూ.. పాత రిసార్ట్స్‌ను పునర్నిర్మించడానికి కొండను తవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కొండ జోలికి వెళ్లబోమని, నిర్మాణాలు కేవలం మైదాన ప్రాంతాలకే పరిమితమని మీరు చెప్పారు కదా? అని సింఘ్వీని ప్రశ్నించారు. కొండ ఫొటోలను చూస్తే పచ్చదనమంతా మాయమై మట్టి తేలిందని జస్టిస్‌ హిమా కోహ్లి గుర్తుచేశారు. అందుకు న్యాయవాది సింఘ్వీ స్పందిస్తూ.. తనకు వాస్తవాలేంటో తెలియదని, ఫొటోలు ఇప్పుడే తన ముందుకొచ్చాయని, విషయం తెలుసుకొని చెబుతానని విన్నవించారు. వర్షాకాలం వస్తున్నందున ఇప్పటికే పెట్టిన ఖర్చు వృథా కాకుండా నిర్మాణాలకు అనుమతివ్వాలని కోరారు. జస్టిస్‌ గవాయ్‌ స్పందిస్తూ.. తాము నిర్మాణాలను ఆపాలనుకోవడంలేదని, అదే సమయంలో సరిదిద్దలేనంత విధ్వంసానికి అనుమతించడం సాధ్యంకాదని పేర్కొన్నారు. 62 ఎకరాలకుగాను తాము 9.88 ఎకరాలనే ఉపయోగించుకుంటున్నామని సింఘ్వీ చెప్పారు. హైకోర్టు తదుపరి నిర్ణయం తీసుకొనేంతవరకు కొండ తవ్వకాలను చేపట్టకూడదని జస్టిస్‌ గవాయ్‌ స్పష్టంచేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jun 2, 2022, 3:53 AM IST

ABOUT THE AUTHOR

...view details