AP PRC: ఇంటి అద్దె భత్యం, ఫిట్మెంట్ అంశాలపై పలు ఉద్యోగ సంఘాల నేతలు సీఎంవో కార్యదర్శి ధనుంజయ్రెడ్డితో సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వెంకటరామిరెడ్డి తదితరులు హెచ్ఆర్ఏకు సంబంధించిన అంశాలను సీఎంవో కార్యదర్శికి వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో ఇంటి అద్దె భత్యం ముడిపడి ఉండటంతో దానిని త్వరితగతిన ఖరారు చేయాలని కోరారు. పీఆర్సీ నివేదికలో ఉన్నట్లుగా వర్గీకరణ చేసి ఇస్తే ఉద్యోగులంతా నష్టపోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు హెచ్ఆర్ఏకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇచ్చేందుకు ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసే అవకాశం ఉంది. దీంతో మార్పుచేర్పులకు సంబంధించి సూచనలు చేయాల్సిందిగా ధనుంజయ్ రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం: బొప్పరాజు
ఉద్యోగ విరమణ వయసు పెంచడం పట్ల ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్న ఆయన... ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, అదనపు పింఛను గురించి ప్రభుత్వానికి స్పష్టంగా వివరించామన్నారు. హెచ్ఆర్ఏపై కింది స్థాయి నుంచి ఒత్తిడి ఎక్కువగా ఉందన్నారు. హెచ్ఆర్ఏ పై 24, 16, 8 స్లాబులను ఆమోదించవద్దని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఈ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని అధికారులు చెప్పారని వెల్లడించారు.
"ప్రణాళిక ప్రకారం సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పారు. సమస్యల పరిష్కారానికి సమయం నిర్దేశించడం సంతోషం. హెచ్ఆర్ఏ, అదనపు పింఛనుపై అధికారులతో చర్చించాం. హెచ్ఆర్ఏపై సీఎస్ కమిటీ సిఫారసులు పట్టించుకోవద్దని కోరాం. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం" - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్
రేపటి సమావేశం వాయిదా..