కరోనా బారినపడిన వైద్య సిబ్బంది చికిత్సకయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు. తీవ్ర అస్వస్థతతో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యుడు ఎన్.భాస్కరరావుకు ఖర్చయిన సుమారు రూ.కోటిన్నరను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అందించేందుకు సీఎం జగన్ ఆమోదించారని వివరించారు.
వైద్య సిబ్బందికి సంబంధించి ఇలాంటి కేసులు ఇంకా ఏవైనా తమ దృష్టికి వస్తే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని వెల్లడించారు. శనివారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ నెలరోజుల్లో టీకాలను వేస్తాం. ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్లైన్ వర్కర్లు, 45 ఏళ్లు దాటిన వారికి కలిపి 53.08% మందికి తొలి టీకా వేశాం’ అని వెల్లడించారు.
యువతపై మూడో దశ ప్రభావం
‘కరోనా మూడో దశ అంటూ వస్తే యువతపై ఎక్కువ ప్రభావం కనిపించే అవకాశముంది. వైరస్ మ్యుటేషన్ ఎలా ఉన్నా మూడో దశలో యువకులు, పిల్లలు ఎక్కువ ప్రభావితం కావచ్చన్న ఉద్దేశంతో పడకలు, వెంటిలేటర్ల పెంపు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాం. మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే కేసుల తగ్గుదలకు తగ్గట్టు మరణాల సంఖ్య తగ్గాలని లేదు. ఇది బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడుతుంది. మేము ఎలాంటి వివరాలనూ దాచడం లేదు’ అని అనిల్కుమార్ సింఘాల్ వెల్లడించారు.