ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2021, 10:46 AM IST

ETV Bharat / city

Agriculture motors: జనవరి నుంచి వ్యవసాయ మీటర్లు..!

Agriculture motors: వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు బిగించే ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే మీటర్ల సరఫరా కోసం ఏజెన్సీలను ఖరారు చేశారు. వీరు సరఫరా చేసే మీటర్ల సామర్థ్య పరీక్ష తుది దశకు చేరింది. ఈ నెలాఖరు నివేదిక అందనుంది. అనంతరం మీటర్లను దశలవారీగా బిగిస్తారు. దీనిపై రైతు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉచిత విద్యుత్తును మంగళం పాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శిస్తున్నాయి. నాణ్యమైన విద్యుత్తు, జవాబుదారీ కోసమే దీనికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్ల రికార్డుల ప్రక్షాళన పూర్తి అయింది.

Agriculture motors
Agriculture motors

Agriculture motors: మీటర్లు సరఫరా చేసేందుకు సీపీడీసీఎల్‌ టెండర్లు పిలిచింది. ఇందులో ఎల్‌ అండ్‌ టి, సెక్యూర్‌ సంస్థలు సరఫరా కాంట్రాక్టును దక్కించుకున్నాయి. నిబంధనల ప్రకారం ఈ సంస్థలు బిగించే మీటర్ల సామర్థ్యాన్ని పరీక్షల్లో ధ్రువీకరించాల్సి ఉంది. ఇందులో భాగంగా వీటిని బెంగళూరులోని సీపీఆర్‌ఐ (సెంట్రల్‌ పవర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌)లో నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయా లేదా అన్నది తనిఖీ చేస్తున్నారు. రెండు నెలల పాటు ఉష్ణ, శీతల, అధిక వర్షాలకు ఇవి ఎలా పనిచేస్తున్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఇవి పూర్తి అవుతాయి. పరీక్షలకు సంబంధించి ఫలితాలు డిస్కమ్‌కు అందుతాయి. సంతృప్తికరంగా ఉంటే ఏజెన్సీలకు ఆర్డర్లు ఇవ్వనున్నారు.

రైతుల నుంచి అంగీకార పత్రాలు

విజయవాడ సర్కిల్‌ పరిధిలో మొత్తం 1,05,408 వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. కనెక్షన్లకు సంబంధించి డిస్కమ్‌ వద్ద ఉన్న దస్త్రాల్లోని వివరాలను సిబ్బంది సరిపోల్చుకున్నారు. చాలా చోట్ల కనెక్షన్లు తీసుకున్న వారు చనిపోయారు. తర్వాత పేర్లను మార్చలేదు. ఇంకా పాత పేర్లపైనే విద్యుత్తు బిల్లులు వస్తున్నాయి. ఇటువంటి వాటికి సంబంధించి మార్పులు చేశారు. పాసుపుస్తకం, భూ యాజమాన్య హక్కు పత్రం ఆధారంగా కనెక్షన్లను ప్రస్తుతం ఉన్న హక్కుదారుడి పేరిట నమోదు చేశారు. రైతుల అందరి నుంచి అంగీకార పత్రాలను అధికారులు తీసుకున్నారు. ఇప్పటి వరకు 1,04,084 కనెక్షన్ల పరిశీలన పూర్తి అయింది. మరో 322 కనెక్షన్ల తనిఖీ పురోగతిలో ఉంది. మిగిలిన 1,002 మందికి సంబంధించి వివరాలు లభ్యం కాలేదు. వీటికి సంబంధించి యజమానులు విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో ఉన్నందున సాధ్యం కాలేదు. పలు చోట్ల వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వెలిశాయి.

అన్నదాతల పేరిట ఎస్క్రో ఖాతాలు

వచ్చే ఏడాది జనవరి నుంచి మీటర్లను బిగించే పని మొదలవుతుంది. ఇది దాదాపు 6 నెలల పాటు కొనసాగనుంది. సీపీడీసీఎల్‌ ఆర్డరు ఇచ్చిన తర్వాత రెండు ఏజెన్సీలు దశలవారీగా సరఫరా చేయనున్నాయి. ఈ ప్రక్రియతో పాటే రైతుల పేరుతో ఎస్క్రో ఖాతాలను తెరవనున్నారు. సంబంధిత ఏజెన్సీ రీడింగ్‌ తీసి, బిల్లులు తయారు చేసి డిస్కమ్‌కు అందజేస్తుంది. వీటి ఆధారంగా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తుంది. అనంతరం ఈ మొత్తం డిస్కమ్‌ ఖాతాలకు బదిలీ అవుతుంది. కనెక్షన్లకు సంబంధించి బిల్లింగ్‌ వివరాలను ఏజెన్సీలే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో ఐదేళ్ల పాటు నిర్వహించాల్సి ఉంది.

ఇదీ చదవండి:

HC On Justice Chandru: 'వెలుగులో ఉండేందుకే ఇలాంటి వ్యాఖ్యలు'.. జస్టిస్‌ చంద్రుపై హైకోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details