ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సన్నాహాలు!

By

Published : Jan 24, 2020, 8:36 PM IST

Updated : Jan 25, 2020, 6:29 AM IST

పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చకముందే.. ప్రభుత్వం అమరావతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు తెరతీసింది. తుళ్లూరు మండలం పెదపరిమిలో గ్రామసభ నిర్వహించి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఏసీసీఎంసీ) ఏర్పాటుకు కసరత్తు మొదలుపెట్టింది

Amravathi corporation will be set up by ap governament
Amravathi corporation to be set up by ap governament

రాజధాని అమరావతిలో ప్రస్తుతం ఉన్న 25 గ్రామపంచాయతీలతో పాటు, కొత్తగా మూడు పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్‌ సిటీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (ఏసీసీఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చకముందే.. ప్రభుత్వం ఏసీసీఎంసీ ఏర్పాటుకు తెరతీసింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 25 గ్రామ పంచాయతీలు (శివారు గ్రామాలతో కలిపి మొత్తం 29 గ్రామాలు) ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్నాయి. తుళ్లూరు మండలంలో 19 పంచాయతీలుండగా, ఇదివరకు 16 పంచాయతీల్నే రాజధాని పరిధిలోకి తెచ్చారు. పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం పంచాయతీలనూ ఇప్పుడు ఏసీసీఎంసీ పరిధిలోకి తేనున్నారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారు. పెదపరిమిలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. దీనిపై గ్రామస్థులకు సమాచారం లేక ఎక్కువమంది రాలేదు. విలీనానికి గ్రామప్రజలు ఆమోదం చెబుతూ తీర్మానం ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. అందరికీ సమాచారం ఇవ్వకుండానే గ్రామసభ ఎలా నిర్వహించారని అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంగళవారం రాత్రి గ్రామంలోని మైకులో చెప్పామని, 200 మంది వరకు వచ్చారని మొదట చెప్పారు. శుక్రవారం సాయంత్రం పెదపరిమి గ్రామ ప్రత్యేకాధికారి ఇ.సత్యకుమార్‌ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తక్కువగా రావడంతో గ్రామసభను సోమవారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. పెదపరిమితో పాటు, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లోనూ సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నారు.

ఈ నెల 9నే ఉత్తర్వులు..!
రాజధాని పరిధిలోని 25 గ్రామపంచాయతీలను ఏసీసీఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆయా పంచాయతీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసి, అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ జనవరి 9న గుంటూరు జిల్లా పంచాయతీ అధికారికి మెమో జారీచేశారు. నోటీసు అందిన 10 రోజుల్లోగా అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.

ఆ 3 గ్రామాల్నీ కలపాలని ఎమ్మెల్యే లేఖ
ప్రతిపాదిత ఏసీసీఎంసీలో తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్ని కలపాలని కోరుతూ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ నెల 14న గుంటూరు జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. ఏసీసీఎంసీ పరిధిలోకి వచ్చే గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించవద్దని పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని, తుళ్లూరు మండలంలోని మిగతా మూడు పంచాయతీలకూ ఎన్నికలు నిర్వహించకుండా, ఏసీసీఎంసీలో విలీనం చేయాలని ఆమె విజ్ఞప్తిచేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆ మూడు గ్రామాల్నీ ఏసీసీఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మూడురోజుల ముందే నోటీసులు..

  • ముఖ్యమైన అంశాలపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోడానికి ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తుంది. గ్రామసభల నిర్వహణకు స్పష్టమైన విధివిధానాలున్నాయి.
  • సభ నిర్వహణకు మూడురోజుల ముందే ఎజెండా సిద్ధంచేయాలి.
  • గ్రామంలోని మూడు ముఖ్యమైన కూడళ్లలో ప్రజలందరికీ కనిపించేలా మూడురోజుల ముందే నోటీసులు అతికించాలి.
  • పంచాయతీ కార్యాలయ నోటీసుబోర్డులోనూ ఉంచాలి.. గ్రామంలో చాటింపు వేయించాలి.
  • గ్రామ జనాభాలో పది శాతం మంది హాజరైతేనే కోరం ఉన్నట్టుగా భావించి సభ నిర్వహిస్తారు.
  • మెజారిటీ అభిప్రాయం మేరకు ఎజెండాలోని అంశాలను ఆమోదించి, తీర్మానం చేస్తారు.
  • పెదపరిమి గ్రామసభలో.. నోటీసులు అతికించడం, చాటింపు వేయించడం వంటివేమీ చేయలేదు.
  • కోరం లేకపోయినా సభ జరిగినట్టు మొదట తీర్మానం చేసేశారు. తర్వాత గ్రామసభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.


ఇదీ చదవండి :'రెండేళ్ల వరకు మండలిని కదిలించ లేరు'

Last Updated : Jan 25, 2020, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details