ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 15, 2020, 7:55 AM IST

ETV Bharat / city

ట్రిపుల్‌ ఐటీ, ఇంటర్‌ ప్రవేశాలపై సందిగ్ధత

పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్‌ పాయింట్లు లేకుండా మార్కుల జాబితాల్లో (మెమో) ఉత్తీర్ణులైనట్లు ఇవ్వనుండటంతో ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐ, ఇంటర్‌ ప్రవేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఈసారి పాయింట్లు లేనందున వీరికి పై తరగతుల్లోకి ప్రవేశాలు ఎలా కల్పిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

iit-iti-inter-admissions in state
iit-iti-inter-admissions in state

పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు లేకుండా మార్కుల జాబితాల్లో (మెమో) ఉత్తీర్ణులైనట్లు ఇవ్వనుండటంతో ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐ, ఇంటర్‌ ప్రవేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. హాల్‌ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని, గ్రేడ్లు, గ్రేడ్‌ పాయింట్లు ఉండవని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్‌, ఒకసారి అనుత్తీర్ణులైన విద్యార్థులకు కలిపి 6,38,604 హాల్‌ టిక్కెట్లను జారీ చేశారు. ఇప్పుడు వీరంతా ఉత్తీర్ణులైనట్లే. పదో తరగతి తర్వాత ఇంటర్‌, ట్రిపుల్‌ ఐటీ, ఐటీఐల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు విద్యార్థులు సాధించిన గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈసారి పాయింట్లు లేనందున వీరికి పై తరగతుల్లోకి ప్రవేశాలు ఎలా కల్పిస్తారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

తెలంగాణ, తమిళనాడులో ఇలా...
తెలంగాణలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసి, విద్యార్థులకు పాఠశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా గ్రేడ్‌ పాయింట్లు కేటాయించారు. తమిళనాడులో త్రైమాసిక, అర్ధ సంవత్సర పరీక్షలకు 40% చొప్పున, హాజరుకు 20% చొప్పున వెయిటేజీ ఇచ్చి మార్కులిచ్చారు. ఏపీలో అంతర్గత మార్కులను సేకరించినా వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై మథనం
రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్‌ఐటీలున్నాయి. వీటిల్లో 4వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎంతో డిమాండ్‌ ఉంది. ఇప్పటివరకు గ్రేడ్‌ పాయింట్లు, రిజర్వేషన్లు, సామాజిక వెనుకబాటు సూచీతో (0.4 పాయింట్లు) సీట్లు కేటాయిస్తున్నారు. వెనుకబాటు సూచీ పాయింట్లతో ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి ఎక్కువ సీట్లు దక్కేవి. ఒకవేళ ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ప్రైవేటు బడుల విద్యార్థులకు ఎక్కువ మార్కులొచ్చే అవకాశముంది. సామాజిక వెనుకబాటు సూచీ కింద మార్కులు కలిపే అవకాశమూ ఉండకపోవచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

ఇంటర్‌ ఆన్‌లైన్‌కూ కష్టాలే!
ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. గ్రేడ్‌ పాయింట్లు లేని కారణంగా ఏ కళాశాలలో ఎవరికి సీట్లు కేటాయించాలనేది గందరగోళంగా మారొచ్చు. కొవిడ్‌-19 సమయంలో ప్రవేశ పరీక్ష సాధ్యమేనా? ఒకవేళ ఏ కళాశాలకు ఆ కళాశాల పరీక్ష నిర్వహించాల్సి వస్తే ప్రైవేటులో ఇది తూతూమంత్రంగా మారే ప్రమాదముంది.
* ఐటీఐల్లో ప్రవేశాలకూ పరీక్షలు నిర్వహించాల్సి వస్తుంది. వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండడంతో ఇప్పటికే ఎంసెట్‌ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.

ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలి..

రాజీవ్‌ గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం చట్టంలో ప్రవేశ పరీక్ష లేదు. ప్రస్తుతం పదో తరగతిలో గ్రేడ్‌పాయింట్లు లేనందున ప్రవేశ పరీక్ష నిర్వహించాలంటే చట్టంలో మార్పులు చేయాలి. మొదట అకాడమిక్‌, గవర్నింగ్‌ కౌన్సిల్‌లో ఈ అంశాన్ని పెట్టాలి. ఈ ఏడాదికి ఆర్డినెన్స్‌/ప్రత్యేక ఉత్తర్వు తీసుకురావాల్సి ఉంటుంది.-కేసీరెడ్డి, కులపతి, ఆర్జీయూకేటీ

ఇదీ చదవండి:

రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులు ఖరారు..!

ABOUT THE AUTHOR

...view details