ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Amaravati Padayatra: కర్షక జాతరలా పాదయాత్ర.. నేడు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశం

farmers padayatra: ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నేడు చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. పోలీసులు, అధికార పార్టీ నేతలు అడ్డంకులు సృష్టించినా.. ప్రతి జిల్లాలో ప్రజల అపూర్వ మద్దతుతో కదం తొక్కుతున్నారు. పాదయాత్రను విజయ యాత్రగా మలుచుకునే క్రమంలో రైతులు ముందుకు సాగుతున్నారు.

By

Published : Dec 7, 2021, 7:09 AM IST

AMARAVATI PADAYATRA
AMARAVATI PADAYATRA

amaravati farmers padayatra: అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర తిరుమల శ్రీనివాసుడి చెంతకు సమీపిస్తోంది. ఇప్పటికే దిగ్విజయంగా మూడు జిల్లాలను దాటుకుని వచ్చిన రైతులు.. నేడు ఆ కలియుగ వైకుంఠనాథుడు కొలువై ఉండే చిత్తూరు జిల్లాలోకి అడుగుపెట్టనున్నారు. 37వ రోజు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ప్రారంభం కానున్న యాత్ర.. వెల్లివెడు మీదుగా శ్రీకాళహస్తి మండలంలోని జగ్గరాజుపల్లెలోకి ప్రవేశించనుంది. సోమవారం వెంకటగిరిలో జరిగిన పాదయాత్ర కర్షక జాతరను తలపించింది. విద్యార్థులు, వృత్తి నిపుణులు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలు రైతులతో పాదం కలిపారు. వెంకటగిరి యాదవ సంఘం వీరతాళ్లు, తప్పెట్లు, టపాసులతో అన్నదాతలకు స్వాగతం చెప్పింది.

ప్రభుత్వం కళ్లు తెరవాలి..

రాజధాని రైతులకు సంఫీుభావం తెలిపేందుకు వచ్చిన స్థానికులతో వెంకటగిరి పట్టణం జనసంద్రంగా మారింది. అడుగడుగునా మహిళలపై పూలవర్షం కురిపించారు. అమరావతి రాజధాని కొనసాగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి..రాజధానిని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీ నుంచి వచ్చిన భారతీయ కిసాన్ సంఘ్ ప్రతినిధులు అమరావతి రైతులు విజయం సాధించాలని అభిలాషించారు.

ఎన్నో అడ్డంకులు..

మధ్యాహ్న భోజనం కోసం అన్నదాతలు వాంపలి-ఎంపేడు గ్రామాల మధ్య ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాట్లు చేసుకోగా.. స్థానిక అధికార నేతలు అడ్డు తగిలారు. ఎంపేడు సర్పంచ్ ట్రాక్టర్‌తో ఆ ప్రదేశాన్ని దున్నించారు. ఈ పరిణామం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన రైతులు..ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా యాత్ర కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. అధికార పార్టీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. చిత్తూరు జిల్లాలో యాత్ర విజయవంతం చేస్తామని మాజీమంత్రి అమర్నాథ్‌రెడ్డి తెలిపారు. ఇవాళ వెంకటగిరి నుంచి దాదాపు 15 కిలోమీటర్లు నడిచి అన్నదాతలు చిత్తూరు జిల్లాలోని చింతల పాలెం చేరుకోనున్నారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

ఇదీ చదవండి:

HIGH COURT JUDGES: హైకోర్టుకు నూతన న్యాయమూర్తులు.. కేంద్ర న్యాయశాఖ ఆదేశాలు

ABOUT THE AUTHOR

...view details