రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ పోరాడుతున్న రైతులు ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. ఆదివారం నాడు ఉద్ధండరాయినిపాలెం దీక్షా శిబిరంపై దాడి జరగటంతో ఒక్కసారిగా రాజధానిలో వాతావరణం వేడెక్కింది. మహిళా రైతులపై జరిగిన దాడిని ఖండిస్తూ తుళ్లూరులో రహదారిపైనే ధర్నా నిర్వహించారు. ఆదివారం రాత్రంతా రోడ్డుపైనే నిద్రాహారాలు మాని ఆందోళన నిర్వహించారు. ఇవాళ కూడా ధర్నా కొనసాగింది. మండుటెండను కూడా లెక్కచేయకుండా మహిళలు ఆందోళన చేపట్టారు.
స్వల్ప ఉద్రిక్తత...
నిరసన తెలిపే క్రమంలో కొందరు మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. మరికొందరు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆందోళన చేస్తున్న వారిని బలవంతంగా లేపేందుకు పోలీసులు ప్రయత్నించటం ఉద్రిక్తతకు దారితీసింది. తమను శాంతియుతంగా ఆందోళన చేసుకోనివ్వాలంటూ రైతులు పోలీసు అధికారుల కాళ్లకు మొక్కుతూ నిరసన తెలిపారు. బలవంతంగా పంపాలని చూస్తే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని గ్రహించిన పోలీసులు వెనక్కు తగ్గారు. ఐకాస నేతలతో చర్చించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, తెనాలి శ్రావణ్ కుమార్, ఐకాస నేతలతో తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడారు. మహిళా రైతులపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, ఉద్ధండరాయినిపాలెంలోని దీక్షా శిబిరం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఆందోళనలు ఆగవు...
ఇంటింటికి అమరావతి కార్యక్రమం నిర్వహిస్తున్న రాజధాని మహిళలపై ఎంపీ నందిగం సురేష్ అనుచరులు దాడికి పాల్పడ్డారని రైతులు ఆరోపించారు. రాజధాని కోసం భూములు ఇచ్చి ఓవైపు పోలీసుల లాఠీ దెబ్బలు తింటున్నామని... ఇపుడు అమరావతితో సంబంధం లేనివాళ్లు వచ్చి దాడులు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించినా.. లేకున్నా అమరావతి కోసం తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతులు స్పష్టం చేశారు.