ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హోరెత్తిన నిరసనలు.. కొనసాగుతున్న అమరావతి ఆందోళనలు

మహిళలపై పోలీసుల చర్యలకు నిరసనగా శనివారం అమరావతి రైతులు చేపట్టిన రాజధాని బంద్‌ విజయవంతమైంది. మహిళలు ధర్నాలకే పరిమితం కాకుండా పెద్ద ఎత్తున ర్యాలీలు చేస్తూ అందరినీ ఉద్యమంవైపు నడిపించారు. నేడు మరింత బలంగా తమ నిరసన స్వరాన్ని వినిపిస్తామని రైతులు తెలిపారు. 19వ రోజూ రాజధాని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగనున్నాయి.

By

Published : Jan 5, 2020, 6:25 AM IST

Updated : Jan 5, 2020, 8:35 AM IST

Amaravathi farmers agitation turns into 19th day
అమరావతి రైతుల ఆందోళనలు

అమరావతి రైతుల ఆందోళన

ప్రజారాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి రైతులు.. ఆందోళనలు ఉద్ధృతం చేశారు. శుక్రవారం నాటి పోలీసుల చర్యలను తమకు జరిగిన పరాభవంగా భావించిన మహిళారైతులు మరింత పట్టుదలతో ఆందోళనల్లో పాల్గొన్నారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేపట్టారు. టెంట్లు వేసేందుకు పోలీసులు నిరాకరించినా... రోడ్లపైనే బైఠాయించి ఆందోళనలు కొనసాగించారు. మహిళలకు బాసటగా ఎక్కడికక్కడ ర్యాలీలు నిర్వహించారు. రాత్రివేళల్లో పోలీసులు ఇళ్లలోకి చొరబడి తనిఖీల పేరుతో వేధిస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. కమిటీల పేరుతో ప్రభుత్వం మోసగిస్తోందని కన్నీటిపర్యంతమయ్యారు.

ఆవేదనతో రైతు మృతి

మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులకు చుట్టుపక్కల గ్రామాలు, కృష్ణా జిల్లా రైతుల నుంచి మద్దతు లభిస్తోంది. దొండపాడు, నేలపాడు, నెక్కల్లు, బోరుపాలెం, వెంకటపాలెం నుంచి మహిళలు పెద్దసంఖ్యలో తరలివచ్చి.. మందడంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు మల్లికార్జునరావుకు నివాళులు అర్పించారు. మహిళలపై పోలీసుల దాడిని నిరసిస్తూ తుళ్లూరులో మహిళలు వర్తక, విద్యాసంస్థలను మూసివేయించారు. బోస్టన్‌ కమిటీ ఓ బోగస్‌ కమిటీ అంటూ నిరసన చేశారు. ప్రభుత్వం, పోలీసులే తమపై దౌర్జన్యాలకు పాల్పడితో ఎవరితో చెప్పుకోవాలంటూ వాపోయారు.

హిందూ మహాసభ సంఘీభావం

తుళ్లూరులో రాజధాని రైతుల మహాధర్నాకు అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు సంఘీభావం ప్రకటించారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌తో పాటు ఏపీ, తెలంగాణ హిందూ మహాసభల అధ్యక్షులు రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. అఖిలపక్షం నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు రైతులకు బాసటగా నిలిచారు.

19వ రోజూ కొనసాగునున్న నిరసనలు

నేటి నుంచి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని రాజధాని రైతుల ఐకాస ప్రకటించింది. మందడం, తుళ్లూరులో మహాధర్నాలు నిర్వహించనుండగా... వెలగపూడి, కృష్ణాయపాలెంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగనున్నాయి. ప్రకాశం, గోదావరి జిల్లాల్లోనూ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు ఆందోళనలు చేపట్టనున్నాయి.

ఇదీ చదవండి :

'ఉద్యమం చేస్తున్న రైతులంతా పెయిడ్​ ఆర్టిస్టులే'

Last Updated : Jan 5, 2020, 8:35 AM IST

ABOUT THE AUTHOR

...view details