144 సెక్షన్ పేరుతో గృహ నిర్బంధాలు..ముందస్తు అరెస్టులు - అమరావతిలో 144 సెక్షన్
3 రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ రైతులు పాదయాత్రకు పిలుపునిచ్చిన వేళ.. కృష్ణా జిల్లాలో తెలుగుదేశం నాయకుల గృహ నిర్బంధం, ముందస్తు అరెస్టుల పర్వం కొనసాగుతోంది. విజయవాడలో.. తెలుగు యువత అధ్యక్షుడు దేవినేని చందును... గృహ నిర్బంధం చేశారు. బెంజ్ సర్కిల్లో ఐకాస కార్యాలయానికి తాళం వేసిన పోలీసులు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్నూ.. గృహ నిర్బంధించారు.
![144 సెక్షన్ పేరుతో గృహ నిర్బంధాలు..ముందస్తు అరెస్టులు amaravathi-144-section](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5657783-417-5657783-1578623843908.jpg)
3 రాజధానుల ప్రతిపాదనలను నిరసిస్తూ అమరావతి ప్రాంత రైతులు పిలుపునిచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు. 24వరోజు నిరసనలో భాగంగా.... రైతులు ఉద్ధండరాయునిపాలెం నుంచి విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకూ పాదయాత్రకు పిలుపునిచ్చారు. ముందస్తు చర్యల్లో భాగంగా రైతు నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 144 సెక్షన్, 30 యాక్టు అమల్లో ఉన్నందువల్ల... ఎవరూ బయటకు రావద్దని ప్రకటించారు. గ్రామాల ప్రధాన కూడళ్లలో ముళ్లకంచెలు ఏర్పాటు చేశారు. మందడం, వెలగపూడిలోనూ రైతులు బయటకు రాకుండా ముందుజాగ్రత్తగా పోలీసుల మోహరించారు. పోలీసుల తీరుపై రైతులు మండిపడుతున్నారు. శాంతియుత నిరసన తెలపుతున్న తమను.. మానసికంగానూ ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయం వరకు చేస్తున్న పాదయాత్రను అడ్డుకుని భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దని మండిపడుతున్నారు. బెంజ్ సర్కిల్లో ఐకాస కార్యాలయానికి తాళం వేసిన పోలీసులు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్నూ.. గృహ నిర్బంధించారు.