కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశ వ్యాప్తంగా అన్ని రైళ్లను రద్దు చేసినట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. ఈ నిర్ణయం అమలులో భాగంగా.. మార్చి 31 అర్ధరాత్రి వరకు అన్ని ప్యాసింజర్, ఎక్స్ప్రెస్, మెయిల్, సబర్బన్, డెమో, ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్, ఎంఎంటీఎస్, ఇతర ప్రత్యేక రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
అందుబాటులో ఐఆర్సీటీసీ..
సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్లు, రిజర్వేషన్ కౌంటర్లు, పార్సిల్ కౌంటర్లు, తినుబండారాల విక్రయాలు.. వాటికి సంబంధించిన స్టాళ్లవంటివన్నీ మూసివేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైళ్లు రద్దు చేయడం వల్ల యూటీఎస్ చరవాణి యాప్ పనిచేయదని.. కేవలం ఐఆర్సీటీసీ పోర్టల్, అప్లికేషన్ మాత్రమే పనిచేస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్ రిజర్వేషన్ల కోసమే అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రీఫండ్ విషయంలో ప్రయాణికులు చింతించాల్సిన అవసరంలేదని జూన్ 21 వరకు నగదు తీసుకునే వెసులుబాటు కల్పించామని రైల్వే అధికారులు వెల్లడించారు. సరకు రవాణా రైళ్లు (గూడ్స్) మాత్రం యథావిధిగా నడుస్తాయని చెప్పారు.