ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 17, 2021, 9:29 PM IST

ETV Bharat / city

హైదరాబాద్​లో ఘనంగా అలయ్-బలయ్ కార్యక్రమం

మన సాంప్రదాయాలు, ఆచారాలు, ప్రాచీన భారతీయ వారసత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కుల, మత, భాష, ప్రాంతీయ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేదే అలయ్‌ బలయ్‌ ఉత్సవ సందేశం అన్నారు. బతుకమ్మ, బోనాలు తెలంగాణ ప్రజల సంస్కృతులను, సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని వెంకయ్యనాయుడు తెలిపారు. హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని జలవిహార్‌లో నిర్వహించిన అలయ్‌-బలయ్‌ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హైదరాబాద్​లో ఘనంగా అలయ్-బలయ్ కార్యక్రమం
హైదరాబాద్​లో ఘనంగా అలయ్-బలయ్ కార్యక్రమం

హైదరాబాద్​లో ఘనంగా అలయ్-బలయ్ కార్యక్రమం

మనందరం విపత్కర పరిస్థితిని ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం.. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. అందుకే ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమ నిబంధనలు, సూచనలు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. మీకోసం మనందరికోసం.. రాష్ట్రం కోసం.. దేశం కోసం ఇది చాలా అవసరమన్నారు. కనీస దూరాన్ని పాటించడం, మాస్క్​లు ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతిరోజూ శారీరక వ్యాయామ, సాంప్రదాయమైన భోజనాలు చేసి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలన్నారు.

ఆ బాధ్యత ప్రతిఒక్కరిదీ..

గత 16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ అలయ్-బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు. సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సాహిత్యం, మాతృభాష తన హృదయానికి ఎంతో దగ్గరగా ఉంటాయన్నారు. వేషం, భాష వేరైనా మనమంతా భారతీయులమని స్పష్టం చేశారు. మన సంప్రదాయాలు, ఆచారాలు, పెద్దలు సూచించిన ప్రాచీన భారతీయ వారసత్వం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ప్రపంచ సంస్కృతుల్లో విశిష్టమైంది భారతీయ సంస్కృతి అని కొనియాడారు. ఆత్మీయత, పరస్పర గౌరవం వ్యవహరించాల్సిన తీరుతెన్నును అలయ్ బలయ్ తెలియజేస్తుందన్నారు.

'అలయ్​ బలయ్​ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో సంతోషంగా ఉంది. స్థానిక సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకుందాం. ఈ కార్యక్రమంలో భాగంగా భారత్​బయోటెక్​ సీఎండీ కృష్ణ ఎల్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అధినేత ప్రసాద్‌రెడ్డి వంటి ప్రముఖులను సన్మానించడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి దత్తాత్రేయ తెరతీశారు.'

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

పలువురికి సన్మానం..

దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పలువురిని సన్మానించారు. భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, రెడ్డి ల్యాబ్స్ అధినేత ప్రసాద్​రెడ్డి, ఏఐజీ ఆసుపత్రుల ఛైర్మన్​ డాక్టర్ నాగేశ్వర్, బయలాజికల్-ఈ వైస్​ప్రెసిడెంట్ మహిమ దాట్లతో పాటు సినీ, రాజకీయ రంగాల్లో సేవలు అందిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్​ను, ఇటీవల మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణును ఉప రాష్ట్రపతి సన్మానించారు.

గిరిజనులతో కలిసి గవర్నర్​ నృత్యం..

అలయ్ బలయ్ సంస్కృతిక కార్యక్రమాలను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అనంతరం పలువురు గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, గిరిజన మహిళల నృత్యాలు అద్భుతంగా ఉన్నాయని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంస్కృతికి అద్దంపడుతుందన్నారు. 16 ఏళ్లుగా దత్తాత్రేయ ఈ వేడుకలను నిర్వహిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో బతుకమ్మ, దసరా ఉత్సవాలు ఎంతో గొప్పగా జరుగుతున్నాయని, అలయ్ బలయ్​లో పాల్గొనడం చాలా సంతోషాన్నించిందన్నారు.

'తెలంగాణలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ అలయ్​ బలయ్​ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. సుమారు 15 ఏళ్లుగా బండారు దత్తాత్రేయను ఈ వేడుకలు నిర్వహించడం గొప్పవిషయం.'

- తమిళిసై సౌందరరాజన్​, తెలంగాణ గవర్నర్​

ఏపీ, తెలంగాణ సీఎంలు ఒక్కటిగా ఉండి..

భిన్న సంస్కృతులు ఉన్నా.. కలిసి ఉందాం.. తెలంగాణ పంటలు, రుచులు పంచుకుందాం.. అని హరియాణా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. ఆంధ్రా, తెలంగాణ గవర్నర్​లు ఒకే వేదికమీదకు ఎలా వస్తున్నారో.. అదేవిధంగా ఆంధ్రా, తెలంగాణ ముఖ్యమంత్రులు కూడా ఒక్కటిగా ఉండి.. అన్ని సమస్యలు పరిష్కరించే ఆలోచనకు రావాలని దత్తాత్రేయ ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా వివిధ వృత్తులలో, రంగాలలో ఉన్నవారిని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి కలుపుతూ గత 16 ఏళ్లుగా బండారు దత్తాత్రేయ అలాయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదు... ప్రత్యర్థులం మాత్రమే అన్నారు. అందరూ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలన్నదే దత్తాత్రేయ ఆకాంక్ష అని అన్నారు.

'ఏపీ, తెలంగాణ గవర్నర్లు ఏవిధంగా ఒకే వేదికమీదకు వస్తున్నారో.. అదే విధంగా ఆంధ్రా, తెలంగాణ సీఎంలు ఒక్కటిగా ఉండి.. అన్ని సమస్యలు పరిష్కరించే ఆలోచనకు రావాలి. సంస్కృతులు, ఆచారాలు, భావాలు, భావజాలాలు.. భిన్నంగా ఉన్నా.. మనందరం కూడా కలిసి ఆడదాం, పాడదాం, భోజనం చేస్తామనేదే ఈ అలయ్​ బలయ్​ ముఖ్య ఉద్దేశం.'

- బండారు దత్తాత్రేయ, హరియాణా గవర్నర్​

ఆ పండుగలంటే గుర్తొచ్చేది దత్తన్నే..

హోళీ, అలాయ్ బలాయ్ అంటే గుర్తుకొచ్చేది దత్తన్నే అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. కేంద్ర మంత్రి అయినా, గవర్నర్ అయినా.. తెలంగాణ, సంస్కృతి సంప్రదాయాలను తప్పకుండా రాబోయే తరాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 16 ఏళ్లుగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారన్నారు. తరతరాల మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయని.. వాటిని తగ్గించాలనే ఉద్దేశ్యమే ఈ ఉత్సవమన్నారు.. బండి సంజయ్​. అధర్మంపై ధర్మం విజయం సాధించడమే దసరా పండగ అని బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి అన్నారు. జెండాలు వేరైనా ఎజెండాలు వేరైనా.. అతి చిన్న అధికారి నుంచి అత్యున్నత అధికారి వరకు సన్మానించే వేదికే అలయ్​ బలయ్ అని పేర్కొన్నారు. సైద్ధాంతిక పరంగా ఎన్ని విభేదాలు ఉన్న.. అందరం కలిసికట్టుగా ఉండాలన్నదే అలయ్ బలయ్ ఉద్దేశమన్నారు. భావి తరాలకు ఈ సాంస్కృతిని అందించాలన్నదే...ఈ వేదిక ఉద్దేశ్యమని తెలిపారు.

దేశంలోనే గొప్ప కార్యక్రమం..

అలయ్ బలయ్ కార్యక్రమం దేశంలోనే చాలా గొప్ప కార్యక్రమమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులను అలయ్ బలయ్​కి ఆహ్వానించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఇదొక శుభపరిణామమన్నారు. దత్తాత్రేయకు భగవంతుడు నిండునూరేళ్ల పాటు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థులే తప్ప శాశ్వత శత్రువులు ఉండరని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రెండేళ్ల నుంచి కరోనా కారణంగా దూరంగా ఉన్న నాయకులంతా అలయ్ బలయ్ వేదిక మీద కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలయ్ బలయ్.. నాయకుల్లో స్ఫూర్తి నింపాలని కవిత కోరుకున్నారు.

ఒకరినొకరు పలకరించుకోని పవన్​, విష్ణు..

16 ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్​ని విజయవంతంగా నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలయ్ బలయ్ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. అయితే ఒకే వేదికపై ఉన్న మంచు విష్ణు, పవన్ కళ్యాణ్ ఒకరినొకరు పలకరించుకోలేదు. రాజకీయాల్లో పార్టీల వారీగా ఎంత తిట్టుకున్నా కొట్టుకున్నా దసరా పండుగ వచ్చిందంటే అందరం ఒకటవుతామని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు. తెలంగాణేతరులకు అలయ్ బలయ్ అంటే అర్థం కాదన్నారు. చాలా ఏళ్లుగా దత్తాత్రేయ అలయ్ బలయ్​ని నిర్వహిస్తూ తెలంగాణలో సరికొత్త సంస్కృతికి శ్రీకారం చుట్టారన్నారు. తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన దసరా పండుగ సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్ని ప్రాంతాల వారు ఈ అలయ్ బలయ్​కి రావడం మంచి పరిణామమన్నారు.

అలయ్ బలాయ్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరించడంతో పాటు సన్మానించారు.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details