ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

''మీడియాను నియంత్రించేలా జీవో ఎందుకు?'' - iju, apuwj

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430పై.. ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ ను కలిశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు.. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెండోరోజూ ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన కొనసాగింది.

on media go

By

Published : Nov 7, 2019, 8:16 AM IST

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2430.. మీడియా సంస్థలు, పాత్రికేయులను బెదిరించేందుకే ఉద్దేశించినట్లు కనిపిస్తోందని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రమౌళీకుమార్‌ ప్రసాద్‌ పునరుద్ఘాటించారు. ఈ జీవోపై సత్వరం చర్యలు తీసుకోవాలని కోరుతూ తనను కలిసిన ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడంపై ప్రతినిధులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

పత్రికలు అవాస్తవ కథనాలు, వార్తలు రాస్తున్నాయని భావిస్తే వ్యక్తులు లేదా ప్రభుత్వ సంస్థలు ఫిర్యాదు చేయొచ్చని, వాటిపై విచారణకు ప్రెస్‌ కౌన్సిల్‌ సిద్ధంగా ఉందని జస్టిస్‌ ప్రసాద్‌ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా జీవోలు జారీ చేయాల్సిన అవసరం లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో విలేకరి సత్యనారాయణ హత్యకు సంబంధించి ప్రభుత్వ, పోలీసు నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని.. నివేదిక రాకుంటే త్వరలోనే స్వీయ నిర్ణయం తీసుకుంటామని జస్టిస్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. ఛైర్మన్‌ను కలిసిన బృందంలో ఐజేయూ నేతలు కె.అమర్‌నాథ్‌, అంబటి ఆంజనేయులు, ఆలపాటి సురేశ్‌కుమార్‌, దూసనపూడి సోమసుందర్‌, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్‌, చిన్న మధ్య తరహా పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు ఉన్నారు.

అనంతరం ప్రతినిధి బృందం కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ వ్యక్తిగత కార్యదర్శికి వినతిపత్రం అందజేసింది. ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ అధ్యక్షుడు శేఖర్‌ గుప్తా, కార్యదర్శి అశోక్‌ కె.భట్టాచార్య, కోశాధికారి షీలాభట్‌, ప్రెస్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు అనంత్‌ బగేత్కర్‌, మలయాళ మనోరమ సంపాదకుడు కె.సచ్చిదానందమూర్తి తదితరులను కలిసి జీవో పూర్వాపరాలు, రాష్ట్రంలో జర్నలిస్టుల ఆందోళనలను వారికి వివరించింది. వారంతా ఏపీయూడబ్ల్యూజే పోరాటానికి మద్దతిస్తామన్నారని ఐవీ సుబ్బారావు తెలిపారు. ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ బల్విందర్‌ సింగ్‌, జమ్మూ ప్రెస్‌ కౌన్సిల్‌ సభ్యుడు ఎంఏ మాజిద్‌, ఐజేయూ మాజీ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ సిన్హా తదితరులు పాల్గొన్నారు.

ఏడబ్ల్యూజేఏ నిరసన

on media go

జర్నలిస్టుల హక్కులను హరించే విధంగా జీవోలు తీసుకురావడం కాదని, అభ్యున్నతికి ప్రభుత్వాలు చొరవ చూపాలని ఏపీడబ్ల్యూజే జాతీయ అధ్యక్షుడు కోటేశ్వరరావు అన్నారు. రెండోరోజు ఆందోళనలో భాగంగా జంతర్‌మంతర్‌ వద్ద మౌన దీక్ష చేపట్టారు. ఏపీ ప్రభుత్వ జీవో 2430, తెలంగాణ జీవో 239ను వెనక్కి తీసుకునేవరకూ పోరాడతామని నిరసన తెలిపారు. కార్యక్రమంలో జాతీయ సమన్వయకర్త బెలిదె హరినాథ్‌, తెలంగాణ అధ్యక్షుడు ఎం.రాజు రెడ్డి, ఏపీఅధ్యక్షుడు కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details