FARMERS SUIICDE: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న పలువురు రైతుల కుటుంబాలను పరిశీలిస్తే 85% మంది దుర్భర జీవనం వెళ్లదీస్తున్నారు. కుటుంబ యజమాని దూరమయ్యాడనే ఆవేదనను దిగమింగుతూ.. పోషణకు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు అప్పుల వాళ్ల ఒత్తిడినీ ఎదుర్కొంటున్నారు. రైతు మరణిస్తే ఉపాధి కోసం భార్యాబిడ్డలు ఊరు విడిచి వెళుతుండగా.. అతనిపైనే ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. రైతుల ఆత్మహత్యలు, దానికి కారణాలు, నివారణ చర్యలపై ప్రభుత్వ దృష్టి కొరవడింది. కొందరికి పరిహారం, మరికొందరికి బీమా పంపిణీకే పరిమితమవుతోంది. రైతు పిల్లల భవిష్యత్తును పట్టించుకోవడం లేదు.
లక్షల్లో లావాదేవీలు చేసి.. రూపాయికీ కొరగాని పరిస్థితుల్లోకి..
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరిశీలిస్తే.. సాగులో వరుస నష్టాలతోనే అప్పుల పాలవుతున్నారని తేలింది. ఏడాదంతా పొలంలోనే ఉన్నా తిండి గింజలకూ సంపాదించుకోలేని దుస్థితి. పంటల పెట్టుబడులు, అమ్మకాల రూపంలో రూ.లక్షల్లో లావాదేవీలు చేసి వందల మంది కూలీలకు ఉపాధి చూపిన రైతులు.. చివరకు చేతిలో వెయ్యి రూపాయలు కూడా లేక విలవిల్లాడుతున్నారు. పిల్లల్ని చదివించలేని అశక్తత, పెళ్లికెదిగిన కుమార్తెలు.. తల్లిదండ్రుల అనారోగ్య సమస్యలు, కుటుంబ భవిష్యత్తు తలచుకుని మానసిక ఆందోళనతో ఆత్మహత్యలను పరిష్కారంగా ఎంచుకుంటున్నారని పలువురు వివరించారు. ఒక్కో రైతు కుటుంబాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అప్పులు వెంటాడుతున్నాయి.
బతుకుదెరువు కోసం.. తలోదారికి..
రైతు సాగు చేస్తే సేద్యం నుంచి పంటకోత, అమ్మకం వరకు ఎంతో మందికి ఉపాధి చూపిస్తారు. అలాంటి అన్నదాతే బలవన్మరణానికి పాల్పడితే ఆయన కుటుంబం కూలిపనికి వెళ్లాల్సి వస్తోంది. ఉపాధి దొరక్క, అప్పులిచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక భూములు అమ్మేస్తున్న పరిస్థితులు చాలాచోట్ల ఉన్నాయి. భర్త చనిపోయాక.. పూట గడవని పరిస్థితుల్లో కొందరు రైతుల భార్యలు బిడ్డలను తీసుకుని పుట్టింటికి చేరుతున్నారు. దీంతో అప్పటి వరకు కొడుకుపైనే ఆధారపడిన వృద్ధులైన తల్లిదండ్రుల పరిస్థితి మరింత దుర్భరంగా మారుతోంది. కొందరు తమ బిడ్డల చదువులు మాన్పించి.. దూర ప్రాంతంలో పనులకు పంపిస్తున్నారు. కొన్ని కుటుంబాల్లో ఆస్తిపరమైన వివాదాలు తలెత్తుతున్నాయి. ఇలా ఏ రకంగా చూసినా రైతు మరణంతో ఆయన కుటుంబం దిక్కులేనిదవుతోంది.
కౌలు రైతు కుటుంబం.. చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం
మిరప బాగా పండితే ఏడాదిలో అప్పులు తీర్చేయొచ్చనే అంజినయ్య ధైర్యం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల ముందు నిలబడలేకపోయింది. అప్పులు తీర్చలేక బలవన్మరణానికి పురికొల్పింది. వందలాది కూలీలకు ఉపాధి చూపిన ఆ కుటుంబం ఇప్పుడు హైదరాబాద్కు వలసపోయి చిత్తుకాగితాలు ఏరుకుని బతికే దుస్థితి దాపురించింది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం నెరుడుప్పలకు చెందిన ఉల్లిగడ్డల అంజినయ్య ఎకరా రూ.15 వేల చొప్పున 12 ఎకరాలు కౌలు తీసుకుని ఏటా ఉల్లి, మిరప, వేరుసెనగ, వరి పంటలు సాగు చేసేవారు. నాలుగేళ్లుగా పంటలు సరిగా పండకపోవడంతో.. తీవ్రంగా నష్టపోయారు. పంట ఖర్చులకు తోడు పిల్లల పెళ్లిళ్లకు చేసిన అప్పులన్నీ కలిసి రూ.32 లక్షలకు చేరాయి. అయినా ఒక్క ఏడాది పండితే మొత్తం తీర్చేస్తాననే ఆయన ధైర్యాన్ని మిర్చి, ఉల్లికి సోకిన తెగుళ్లు దెబ్బతీశాయి. ఈ నష్టాలతో మనస్తాపానికి గురైన అంజినయ్య 2021 డిసెంబరు 13న ఆత్మహత్య చేసుకున్నారు. త్రిసభ్య కమిటీ నివేదికలిచ్చినా బాధిత కుటుంబానికి ఇప్పటి వరకు పరిహారం అందలేదు. ఊళ్లో ఉండలేక హైదరాబాద్కు వెళ్లామని కుమారులు ఈరన్న, నరసింహుడు, విజయ్ తెలిపారు.