ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఈఎస్​ఐ వ్యవహారం...నిందితులపై ఏసీబీ ప్రశ్నల వర్షం

By

Published : Jun 27, 2020, 10:54 PM IST

Updated : Jun 27, 2020, 11:00 PM IST

ఈఎస్​ఐ కొనుగోలు వ్యవహారంపై సమాచారం రాబట్టేందుకు ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. ఔషధాల కొనుగోలు, టెండర్ల ప్రక్రియ, ఆర్డర్లులపై నిందితులను ప్రశ్నించనట్లు సమాచారం. రాజకీయంగా ఎవరు మద్దతిచ్చారు, మధ్యవర్తిత్వం వహించినవారికి లంచం ఇచ్చారా అన్న ప్రశ్నలతో సమాచారం రాబట్టినట్టు తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లో కొన్నింటికి అరెస్టైన అధికారులు సమాధానం ఇవ్వగా, మరికొన్నింటికి మౌనంగా ఉన్నారని సమాచారం.

ఈఎస్​ఐ వ్యవహారం...నిందితులపై ఏసీబీ ప్రశ్నల వర్షం
ఈఎస్​ఐ వ్యవహారం...నిందితులపై ఏసీబీ ప్రశ్నల వర్షం

ఈఎస్​ఐ ఆసుపత్రులు, డిస్పెన్సరీల కోసం ఔషధాలు, సర్జికల్ పరికరాలు కొనుగోలులో ఏ విధానాన్ని అమలు చేశారు? ఓపెన్ టెండర్లు పిలిచారా? ఈ ప్రొక్యూర్‌మెంట్​కు వెళ్లారా? కొటేషన్లు తీసుకున్నారా? ఎల్ 1 బిడ్లను ఎలా ఎంపిక చేశారు? అంటూ ఐఎంఎస్ పూర్వపు డైరెక్టర్లు డా.జి. విజయ్ కుమార్​పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. ఇండెంట్​లో లేని ఔషధాలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చింది? కడప , విజయవాడలోని స్టోర్లలో వినియోగించకుండా వదిలేసిన మందులు ఎందుకు ఉన్నాయి ? అని ప్రశ్నించి వాటికి సమాధానాలు రాబట్టినట్లు సమాచారం.

191 కోట్ల రూపాయల విలువైన పరికరాల కొనుగోలు కోసం ఒక ఆర్డరును 18 కొనుగోలు ఆర్డర్లుగా విభజించి ఎలాంటి ఓపెన్ టెండర్లు పిలవకుండా టెక్నోమెడ్ సంస్థకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఆరా తీశారని సమాచారం. ఈఎస్ఐలో ఔషధాలు, సర్జికల్ పరికరాలు, ల్యాబ్ కిట్ల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే అభియోగంపై అరెస్టైన విశ్రాంత డిప్యూటీ సివిల్ సర్జన్ డా వి.జనార్దన్, ఐఎంఎస్ కార్యాలయ సూపరింటెండెంట్ ఎం. కల్యాణ్ పవన్ చక్రవర్తి , సాయిరామ్ ఫార్మాసిటికల్స్ యజమాని గోనె వెంకట సుబ్బారావులను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ అధికారులు శుక్రవారం వరుసగా రెండో రోజు విచారించారు.

వేర్వేరు కంపెనీల పేరిట వచ్చిన కొటేషన్లలోని ఎన్వలాప్ కవర్లపై ఒకే చేతిరాత ఉండటాన్ని మీరు గుర్తించారా? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రాజకీయంగా ఎవరి మద్దతుతో కొనుగోలు ఆర్డర్లు దక్కించుకున్నారు? అవి రావటానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? ప్రతిగా వారికి మీరు ఎంత లంచం ఇచ్చారు? అంటూ ఫార్మాసిటికల్స్ యజమాని గోనె వెంకటసుబ్బారావును ప్రశ్నించినట్లు తెలిసింది. వీటిలో కొన్నింటికి సరైన సమాధానాలు రాగా .. మరికొన్నింటికీ నిందితులు మౌనం వహించినట్లు సమాచారం. ఇదే కేసులో అరెస్టైన పూర్వపు డైరెక్టర్ డా. సీకే రమేశ్​ కుమార్‌ను టెలీ హెల్త్ సర్వీసెస్ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు... ఆయన హయాంలో జరిగిన మందుల కొనుగోళ్ల వ్యవహారాలపై ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది.

ఇదీ చదవండి :3 రోజులు.. 12 గంటలు.. అచ్చెన్నాయుడిపై ఏసీబీ ప్రశ్నల వర్షం

Last Updated : Jun 27, 2020, 11:00 PM IST

ABOUT THE AUTHOR

...view details