రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రవేశం లేని రంగం ఉండబోదంటే అతిశయోక్తి కాదు. పని విధానాన్ని, పని వాతావరణాన్ని పూర్తి స్థాయిలో మార్చగలిగే సామర్థ్యం ఉన్న కృత్రిమ మేధ ప్రాముఖ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందే గుర్తించింది. ఈ రంగంలో అందివచ్చే అవకాశాలు అందిపుచ్చుకుంటే అంతర్జాతీయంగా పెట్టుబడులు, ప్రత్యేక గుర్తింపు పొందేందుకు 2020ని కృత్రిమ మేధ ఆధారిత ఏడాదిగా ప్రకటించింది. ఇది ప్రకటించి ఏడాది పూర్తైన సందర్భంగా రాష్ట్రం సాధించిన ప్రగతిపై నివేదికను ఆ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. 2020ను కృత్రిమ మేధ సంవత్సరంగా ప్రకటించి 120కి పైగా ఈవెంట్లు, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, ఐఐటీ-హైదరాబాద్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం, అమెజాన్ వంటి సంస్థలతో కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు సర్కార్ తెలిపింది.
అనేక సవాళ్లకు మార్గాలు
కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వ పాలనలో అనేక సవాళ్లకు కృత్రిమ మేధ మార్గాలు చూపిందని కేటీఆర్ అన్నారు. జూన్ -2020లో కృత్రిమ మేధా విభాగంలో విధివిధానాలను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తద్వారా పరిశ్రమలు, స్టార్టప్, అవసరమైన భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకొని ఏఐ నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేసింది. ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లేందుకు నాస్కాం భాగస్వామ్యంతో తెలంగాణ ఏఐ మిషన్ను ప్రారంభించింది. ఆపై ఇంటెల్, ట్రిపుల్ ఐటీ, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో అప్లయిడ్ ఏఐ పరిశోధనా కేంద్రాన్ని అక్టోబర్ 12న ప్రభుత్వం ప్రారంభించింది. కొవిడ్ సంక్షోభ సమయంలో... కృత్రిమ మేధ విజయంపై చాలా అనుమానాలుండేవని... కానీ ప్రభుత్వ విజన్ వాటన్నింటికీ సమాధానాలిచ్చిందని ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగంలో కృత్రిమ మేధా