రాష్ట్రంలోని ప్రధానమైన 5 నదుల్లో రోజూ 14 కోట్ల లీటర్ల మురుగు నీరు కలుస్తోంది. వాటి పక్కనే ఉన్న నగరాలు, పట్టణాల్లో నుంచి వచ్చే మొత్తం 30.2 కోట్ల లీటర్ల నీటిలో నుంచి 54 శాతమే శుద్ధి చేస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే మురుగు నీటిని శుద్ధి చేసే ప్రక్రియ రెండడుగులు ముందుకు, నాలుగు అడుగుల వెనక్కి అన్నట్లుగా తయారైంది. ఇప్పటికే ఉన్న 11 మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీపీ) పూర్తిస్థాయిలో పని చేయడం లేదు. మరో 6 కొత్త ఎస్టీపీల పనులు నిధుల కొరతతో అసంపూర్తిగా నిలిచాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళం నుంచి వచ్చే మురుగును శుద్ధి చేయకుండానే చాలావరకు నేరుగా గోదావరి, కృష్ణా, తుంగభద్ర, కుందు, నాగావళి నదుల్లోకి వదులుతున్నారు. ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఇది వరకే గుర్తించింది. దేశవ్యాప్తంగా 351 నదుల్లో ఇలాంటి సమస్య ఉన్నట్లు ప్రకటించింది. ఆయా నదుల నీటిలో బీఓడీ పరిమితికి మించి ఉంటోందని హెచ్చరించింది. బీఓడీ(బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండు) అంటే... జలకాలుష్యానికి కొలమానం. ఇందులో ఆక్సిజన్ డిమాండు ఎంత ఎక్కువ ఉంటే... అంత స్థాయిలో కాలుష్యం అధికంగా ఉందని అర్ధం. వాడకానికి ఉపయోగించే నీటిలో ఇది గరిష్ఠంగా లీటరుకు 3 మిల్లీ గ్రాముల వరకు అనుమతిస్తారు. అదే పురపాలక సంఘాలు, నగరాల నుంచి వెలువడే వ్యర్థ జలాల విషయానికి వస్తే... లీటరుకు 200 మి.గ్రా నుంచి 400 మి.గ్రా వరకు ఉంటుంది. ఎస్టీపీ ద్వారా దీన్ని 30 వరకు తగ్గించి బయటకు వదులుతారు. పరిశ్రమలకు అనుగుణంగా బీఓడీ మారుతుంటుంది. డిస్టిలరీల నుంచి వెలువడే వ్యర్థాల్లో అత్యధికంగా 50 వేల మి.గ్రా. వరకు ఉంటుంది. డెయిరీ పరిశ్రమల నుంచి వెలువడే నీటిలోనూ 3 వేల మి.గ్రా. వరకు ఉంటుంది.
225 మండలాలకు ఇదే నీటి సరఫరా
అయిదు నదుల నుంచి ఏడు జిల్లాలకు చెందిన 225 మండలాల ప్రజలకు తాగునీటిని అందిస్తున్నారు. వీటిలో పుర, నగరపాలక సంస్థలు, పంచాయతీలకు చెందిన ఇన్ఫిల్ట్రేషన్ బావులు, ఇతర తాగునీటి పథకాలు ఉన్నాయి. శుద్ధి చేయని మురుగు నీటిని నేరుగా నదుల్లోకి విడిచిపెట్టడంతో ఈ ప్రభావం ప్రజల ఆరోగ్యంపై కచ్చితంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పంచాయతీల్లో ఫిల్టర్ బెడ్లు సరిగా పనిచేయని కారణంగా నదుల నీటిని ఓవర్హెడ్ ట్యాంకుల్లోకి పంప్ చేసి, ప్రజలకు నేరుగా సరఫరా చేస్తున్నారు. ఇలాంటిచోట్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ సమస్య కృష్ణా, గోదావరి, నాగావళి నది పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటోంది.