ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / bharat

ముగిసిన మమత సత్య'ఆగ్రహం'

పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దీక్ష విరమించారు.

By

Published : Feb 5, 2019, 10:36 PM IST

దీక్ష విరమించిన మమతా బెనర్జీ

పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఎట్టకేలకు దీక్ష విరమించారు. ఆదివారం మొదలైన దీదీ ఆగ్రహం మూడు రోజుల తర్వాత శాంతించింది. సుప్రీం కోర్టు సానుకూల తీర్పునివ్వడంతో ప్రధాన విపక్షాలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.

"ఇదొక గొప్ప విజయమని విపక్షాలు నమ్ముతున్నాయి. ఈ ధర్నా... ప్రజలకు, దేశానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి గెలుపును అందించింది. సుప్రీం కోర్టు సానుకూలంగా స్పందించడంతో దీక్షను ఇంతటితో విరమించాలని నిశ్చయించాము. ప్రజాస్వామ్య విలువలకు అనుగుణంగానే సుప్రీం తీర్పు ఉంది. ఈ దీక్షను ఈరోజు ముగిస్తున్నాము. కానీ మా నిరసనలను దిల్లీలో కొనసాగిస్తాము."
-మమతా బెనర్జీ, పశ్చిమ్​బంగ ముఖ్యమంత్రి.

కేంద్ర వ్యవస్థలను ఉపయోగించి ప్రజలను భాజపా బెదిరిస్తోందని దీదీ ఆరోపించారు. సీబీఐపై తనకు అపార గౌరవముందన్నారు. ప్రధాని మోదీ, అమిత్​ షా ఆదేశాల మేరకు ​బంగాల్​లో అలజడి సృష్టించిన సీబీఐ... అంతే వేగంగా ఇతర కేసులపైనా విచారణ చేపట్టాలని విమర్శించారు.

అంతకుముందు...

ఆదివారం మొదలైన బంగాల్​ వివాదం మూడో రోజూ కొనసాగింది. సీబీఐ దాఖలు చేసిన అభ్యర్థనను విచారించిన సుప్రీంకోర్టు.. కీలక తీర్పు వెలువరిచింది. సత్యాగ్రహం చేపట్టిన మమతకు విపక్షాల నుంచి మద్దతు పెరిగింది.

అరెస్టు వద్దు... విచారణ మాత్రమే: సుప్రీం

శారదా కుంభకోణం విచారణ కోసం సీబీఐకు సహకరించాలని కోల్​కతా సీపీ రాజీవ్​కుమార్​కు ఆదేశించింది సుప్రీంకోర్టు. రాజీవ్​ను అరెస్టు చేయకూడదని సీబీఐకు సూచించింది.

సీబీఐ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై బంగాల్​ డీజీపీ, కోల్​కతా సీపీకి నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.


తీర్పు ఇద్దరికీ అనుకూలమే!

సుప్రీం తీర్పును బంగాల్ ప్రభుత్వం, కేంద్రం పోటాపోటీగా స్వాగతించాయి. న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉందని... తీర్పు ప్రజాస్వామ్య విజయమని ప్రకటించారు మమత.

బంగాల్​ వివాదాన్ని రాజకీయం చేయాలనుకున్న వారికి అత్యున్నత న్యాయస్థాన తీర్పు ఘోర పరాభవమని కేంద్రమంత్రి రవి శంకర్​ ప్రసాద్ దుయ్యబట్టారు.

మమత సత్యాగ్రహానికి మద్దతు...

మమత సత్యాగ్రహం మూడో రోజూ కొనసాగింది. దీదీకి విపక్షాల నుంచి విశేష మద్దతు లభించింది. అంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కోల్​కతా వెళ్లి మమతను కలిశారు. కాంగ్రెస్​, సమాజ్​వాదీ పార్టీలు దీదీకి అండగా నిలిచాయి.

ఉభయసభల్లో అదే పరిస్థితి...

బంగాల్​ వివాదం వరుసగా రెండో రోజు.. ఉభయసభలను కుదిపేసింది. కేంద్రం తీరుకు నిరసనగా విపక్షాలు ఏకమై ఉభయసభల్లో ఆందోళనలు చేపట్టాయి. గందరగోళం మధ్య రాజ్యసభ పలుమార్లు వాయిదా పడింది. 2గంటలకు మొదలైనా పరిస్థితి సద్దుమణగక సభాపతి సభను రేపటికి వాయిదా వేశారు. లోక్​సభలోనూ ఇదే పరిస్థితి. అనేక సార్లు వాయిదా పడింది.

రాజీవ్​ కుమార్​ పదేళ్ల ముందు...

పదేళ్ల ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. తమ నాయకుల ఫోన్లు టాప్​ చేస్తున్నట్టు రాజీవ్​కుమార్​పై మమత ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే రాజీవ్​కుమార్​ కోసం కేంద్రంపై యుద్ధం చేయడం గమనార్హం.

దీదీ సత్యాగ్రహానికి సంఘీభావం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

ABOUT THE AUTHOR

...view details