ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 2, 2019, 10:47 PM IST

ETV Bharat / bharat

చందాకొచ్చర్​పై మనీలాండరింగ్​ కేసు

ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్​ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్​​ ప్రమోటర్​ వేణుగోపాల్​ ధూత్​లపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది.

చందాకొచ్చర్, ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ

వీడియోకాన్​ గ్రూపుకు ఐసీఐసీఐ బ్యాంకు రూ.1875 కోట్లు అక్రమ రుణం మంజూరు చేసిన కేసులో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రధాన నిందితులు ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్​ కొచ్చర్​, వీడియోకాన్​ గ్రూప్​ ప్రమోటర్​ వేణుగోపాల్​ ధూత్​పై ఈడీ (క్రిమినల్ కేసు) మనీలాండరింగ్ కేసు నమోదుచేసింది.

గత నెలలో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసింది. పోలీస్ ఎఫ్​ఐఆర్​ తరహాలో 'ఎన్​ఫోర్స్​మెంట్​ కేసు దర్యాప్తు నివేదిక (ఈసీఐఆర్​)'ను ఈడీ నమోదు చేసింది. త్వరలోనే నిందితులను విచారణకు పిలవనుంది.

వీడియోకాన్​కు రుణం మంజూరు చేసే విషయంలో డొల్ల కంపెనీలను సృష్టించారా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. వీడియోకాన్​కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం మంజూరు చేసిన కొద్ది రోజుల్లోనే కంపెనీ ప్రమోటర్​ వేణుగోపాల్​ ధూత్​, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈఓ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్​కు చెందిన న్యూపవర్​ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించింది.

తర్వాత పరిణామాల్లో వీడియోకాన్​కు అందించిన రుణాలను 2012లో నిరర్ధక ఆస్తులుగా ప్రకటించారు. ఫలితంగా ఐసీఐసీఐ బ్యాంకుకు రూ.1,730 కోట్ల నష్టం వాటిల్లింది. దీంతో ఈ రుణ మంజూరు వ్యవహారంలో క్విడ్​ప్రోకో (నీకది, నాకిది) జరిగినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.

ABOUT THE AUTHOR

...view details