అమెరికాతో ఉద్రిక్తతలు తగ్గించడం కోసం భారత్ చేసే ఎలాంటి శాంతి ప్రక్రియనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్లో ఇరాన్ రాయబారి అలీ చెగేని తెలిపారు. ఇరాన్ తన అగ్ర కమాండర్ జనరల్ సులేమాని హత్యకు ప్రతీకారంగా ఇరాక్లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి దాడులు చేసిన కొన్ని గంటల తరువాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శాంతికాముక దేశమైన భారత్...ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు ముందుకు వస్తే స్వాగతిస్తామని చెప్పారు. పశ్చిమాసియాలో ఇరాన్ శాంతిని తప్ప యుద్ధాన్ని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.
ఇరాక్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడిపై స్పందించిన అలీ.... తమను తాము రక్షించుకునే క్రమంలో ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇరాన్కు ఉందని ఉద్ఘాటించారు.
విదేశాంగ మంత్రుల మంతనాలు...
యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రి జావాద్ జరీఫ్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియోతో సంభాషించారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగడంపై భారత్ ఆందోళనలను వివరించారు.
ఇదీ చూడండి : ఇరాన్ విమాన ప్రమాదంలో 176 మంది దుర్మరణం