విజయవాడలోని కృష్ణా కాల్వల సుందరీకరణతు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. 4 కిలోమీటర్ల పొడవైన ఏలూరు కాల్వ కాలుష్యాన్ని తొలగించి తక్షణం అందంగా తీర్చిదిద్దే ప్రాజెక్టును చేపట్టాలని నిర్దేశించారు. కృష్ణా-గోదావరి నదులకు అనుసంధానంగా ఉన్న కాల్వల్లో కాలుష్య నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని సూచించారు. కాలుష్య నివారణతోపాటు సుందరీకరణ, చెట్ల పెంపకానికి సంబంధించి... సచివాలయంలో అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
గోదావరి, కృష్ణా కాల్వల్లో బాగుచేయాల్సిన ప్రాంతాలు గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కాల్వలకు అనుసంధానంగా ఎక్కడెక్కడ మురుగునీటి శుద్ధికేంద్రాలు ఏర్పాటు చేయాలో సూచించాలన్నారు. మురుగునీటిని శుద్ధిచేసి తిరిగి కాల్వల్లో విడిచి పెట్టేలా పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. గోదావరి, కృష్ణా కాల్వల స్వచ్ఛత మిషన్ను స్వయంగా పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. కేరళలోని కన్నూరులో చేపట్టిన కాలుష్య నివారణ చర్యల వీడియో జగన్ తిలకించారు. కాలుష్య నియంత్రణ కార్యక్రమాల్లో విస్తృత అనుభవం ఉన్న గండిపేట వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులను సీఎం సమీక్షకు ఆహ్వానించారు. కృష్ణా, గోదావరి కాల్వల శుద్ధి అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ సొసైటీ ప్రతినిధుల సాయం తీసుకోవాలని, కాలుష్య నివారణకు ఏర్పాటుచేసిన కమిటీ ప్రత్యేక అధికారి కాటమనేని భాస్కర్కు సూచించారు.
పౌష్టికాహారం, మధ్యాహ్న భోజన పథకాల నిర్వహణపై సీఎం సమీక్ష
మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, పిల్లల్లో పౌష్టికాహారలోపం ఎదురౌతుందని, వీటి నివారణకు మార్గాలు అన్వేషించాలని సీఎం సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచడం, గుడ్ల సేకరణ, సరఫరాపైనా సీఎం ఆరా తీశారు. 77 గిరిజన సబ్ప్లాన్ అమలు అవుతున్న మండలాల్లో గర్భవతులు, బాలింతలకు నెలకు 1062 రూపాయల విలువైన ఆహారాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు పైలెట్ ప్రాజెక్టు
రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పౌష్టికాహార విలువలు పెంచుతూ పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయాలని సీఎం నిర్ణయించారు. గిరిజన ప్రాంతాలు, సబ్ ప్లాన్ అమలవుతున్న చోట్ల 25 రోజుల పాటు రోజూ భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు ఇవ్వాలని 500 రూపాయలు విలువైన వైఎస్ఆర్ బాలసంజీవని కిట్ తప్పనిసరిగా ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు.
ఎంపిక చేసిన మండలాలు
పౌష్టికాహారమైన 2 కిలోల మల్టీ గ్రేయిన్ అటా, వేరుశనగలతో చేసిన చిక్కీ, అరకిలో రాగిఫ్లేవర్, అరకిలో బెల్లం ఇక నాలుగో వారంలో అరకిలో నువ్వుల ఉండలు ఇవ్వాలని స్పష్టం చేశారు. మహిళలు, చిన్నారులకు సంబంధించి వయసుల వారీగా నిర్దేశిత ప్రమాణాలతో వీటిని అందజేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం 7, విశాఖపట్నం 11, తూర్పుగోదావరి 11, పశ్చిమగోదావరి జిల్లాలో 6 గిరిజన మండలాలతో మొత్తం 36 మండలాలు ఎంపిక చేశామని అధికారులు సీఎంకు తెలిపారు. సబ్ప్లాన్ ప్రాంతానికి సంబంధించి శ్రీకాకుళం 19, విశాఖపట్నం 6, తూర్పుగోదావరి 4, పశ్చిమగోదావరి 3, ప్రకాశం 3, కర్నూలు 3, గుంటూరు జిల్లా నుంచి 3 మండలాలు కలిపి మొత్తం 41 మండలాలు ఎంపిక చేశారు.
ఇదీ చదవండి :