నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఫోన్ ద్వారా కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో కరోనా పరిస్థితి, చేపట్టిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కరోనా లక్షణాలు లేకుంటే ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం చాలా తక్కువని.. తాజాగా డబ్ల్యూహెచ్వో చెప్పిందని కలెక్టర్ పేర్కొన్నారు. లక్షణాలున్నవారే చికిత్సను తీసుకోవాలని.. హోం ఐసోలేషన్ కోసం ఇళ్లలో స్థలం లేని వారికి త్వరలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లావ్యాప్తంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అందుబాటులో ఉన్నాయని నారాయణరెడ్డి వెల్లడించారు. కొవిడ్ రోగులకు వైద్యం అందించే విషయంలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. గత 15 రోజుల్లో జిల్లా 70 వెంటిలేటర్లు ఏర్పాటు చేశామని.. 600 పడకలకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు వివరించారు. కరోనాను అందరూ కలిసి ఎదుర్కోవాలని.. ఇందుకోసం ప్రజలంతా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించారు.
ఇదీ చూడండి: హైడ్రాక్సీ క్లోరోక్విన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది: ట్రంప్