నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో ముందు జాగ్రత్తగా హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాత్రి పట్టణానికి చెందిన వ్యక్తి తీవ్ర దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చారని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి నాగభూషణం తెలిపారు. బాధితుడు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని అన్నారు. వారం రోజుల క్రితం అతని తమ్ముడితో కలిసి గుజరాత్, మహారాష్ట్ర, పూణే లాంటి ప్రదేశాలను సందర్శించారు. ఇటీవలే నాగర్ కర్నూల్ చేరాడని తెలిపారు. అప్పటి నుంచి తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని వైద్యులు వెల్లడించారు.
ముందస్తు జాగ్రత్తగా...
ఈ క్రమంలో వ్యాధి లక్షణాల అనుమానంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడని పేర్కొన్నారు. రాత్రి నుంచే అతడ్ని స్పెషల్ ఐసోలేషన్ వార్డుకు తరలించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు కోలుకుంటున్నాడని వైద్యులు స్పష్టం చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని వైద్యాధికారి చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించామని నాగభూషణం అన్నారు.