మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేకానంద రెండో విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజాంపేట్, గాగిల్లాపూర్, కొంపల్లి, ఐడీపీఎల్, జగద్గిరిగుట్టలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
దుండిగల్ పరిధిలోని గాగిల్లాపూర్ గ్రామంలో ర్యాలీగా వెళ్లి సీజనల్ వ్యాధులపై స్థానికులకు అవగాహన కల్పించారు. ఐడీపీఎల్లోని జోనల్ కమిషనర్ మమతతో కలిసి స్వయంగా రోడ్లపై చెత్తను తొలగించారు. వెన్నెలగడ్డ చెరువులో దోమల నివారణకు డ్రోన్ ద్వారా రసాయనాలను పిచికారీ చేశారు. ఇవాళ ప్రారంభమైన రెండో విడత పట్టణ ప్రగతి జూన్ 8వ తేదీ వరకు కొనసాగనున్నట్లు వెల్లడించారు.