- బండ్లగూడజాగీర్ కార్పొరేషన్లోని పీరంచెరువులోకి పోలీస్ అకాడమీ, స్నేహిత హిల్స్, పీరంచెర్వు ప్రాంతాలు, ఓ కళాశాల మురుగు నేరుగా కలుస్తోంది. హెచ్ఎండీఏ నిర్మించిన ఎస్టీపీ పనిచేయడంలేదు.
- నిజాంపేట కార్పొరేషన్లోని బాచుపల్లి రాజీవ్గాంధీనగర్లోని మేడికుంట చెరువులోకి సమీప కాలనీల మురుగంతా కలుస్తోంది. దుర్వాసన వెదజల్లుతోంది.
- శంషాబాద్ కాముని చెరువులోకి వ్యర్థ జలాలు కలుస్తున్నాయి. మిషన్ కాకతీయ ఫేజ్-1 కింద రూ.8లక్షలతో కట్ట వెడల్పు చేశారు. హెచ్ఎండీఏ, మున్సిపాలిటీ తరఫున రూ.40లక్షలను అభివృద్ధికి వినియోగించారు. అయినా చెరువు బాగుపడలేదు.
చిత్త‘శుద్ధి’ కరవు
కాలనీలు, జనావాసాల నుంచి వచ్చే మురుగునీటిని చెరువులో నేరుగా కలిపేందుకు వీల్లేదు. చెరువు లేదా బహిరంగ ప్రదేశంలో మురుగునీటి శుద్ధి ప్లాంటు(ఎస్టీపీ) నిర్మించి నీటిని శుద్ధి చేయాలి. నీటిని శుద్ధి చేసి స్వచ్ఛంగా మారిన తర్వాతే చెరువులోకి విడిచిపెట్టాలి. మున్సిపల్ అధికారులు నిబంధనలు పాటించడం లేదు. నార్సింగిలోని కోకాపేట చెరువుకు ఎస్టీపీ మంజూరైనా నిర్మించలేదు. ఇబ్రహీంపట్నం చిన్న చెరువు చెత్త డంపింగ్ యార్డుగా మారింది.
లింకు తెగి.. ఆక్రమణలు పెరిగి..
శివారుల్లోని మున్సిపాలిటీలలోని చెరువులతో గ్రేటర్లోని చెరువులతో అనుసంధానం ఉంది. ఆయా పట్టణాలన్నీ నగరంతో మిళితమై ఉన్నాయి. ఒకప్పుడు నగరంలోని చెరువులన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై గొలుసుకట్టు తరహాలో ఉండేవి. ఒక చెరువు నిండిన తర్వాత మరొకచెరువులోకి నీరు చేరేది. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులకు రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, బాలానగర్ ప్రాంతాల్లోని చెరువులతో గొలుసుకట్టు ఉండేది. ఎక్కడికక్కడ నిర్మాణాలు పెరిగిపోవడంతో చెరువుల మధ్య ఉన్న నాలాలు, కాలువలు ఆక్రమణకు గురై ముంపు సమస్య ఏర్పడుతోంది. ఈ ప్రభావం శివారు మున్సిపాలిటీలపైనా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: యూపీ అత్యాచార బాధితురాలు దిల్లీలో మృతి