జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో చేనేత కార్మికులకు కష్టాలు తప్పడం లేదు. ఉదయం నుంచి రెక్కలు ముక్కలు చేసుకొని మరమగ్గం, చేనేత మగ్గాలతో కుస్తీ పట్టినా రోజుకు 250 రూపాయలు కూడా కూలి పడడం లేదు. పెట్టుబడి సదుపాయాలు అందుబాటులో ఉండకపోవడం వల్ల చేనేత కార్మికులు దుర్భర పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి కనీస సౌకర్యాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. తయారుచేసిన వస్త్రాలకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మార్కెటింగ్ లేక అవస్థలు
చేనేత కార్మికులు సాధారణ చీర అయితే రోజుకు ఒకటి చొప్పున నేస్తారు. నెలకు పదివేల రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నారు. సహకార సభ్యులు నేసిన చీరలను టెస్కో కొనుగోలు చేస్తుంది. సంఘాలు లేని కార్మికులు నేసిన చీరలను కూడా టెస్కో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నా కార్యరూపం దాల్చడంలేదు. అమ్ముకోడానికి సరైన మార్కెటింగ్ లేక గద్వాల, హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు వెళ్లి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు.
స్టాక్ చూసైనా రుణం ఇవ్వండి...
సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే సీజన్ ఉంటుందని మిగతా కాలంలో పెట్టిన పెట్టుబడి కోసం ఎంతో కొంత ధరకు అమ్ముకొని నష్ట పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి గిరాకీ లేక స్టాక్ను ఇళ్లల్లోనే పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ప్రభుత్వం స్టాక్ చూసైనా కొంత సొమ్ము రుణంగా ఇస్తే అమ్మిన తరువాత తిరిగి చెల్లిస్తామని అడుగుతున్నారు.
చేనేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తామని ప్రకటించినా... ఇంకా చేయకపోవడం వల్ల బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నామని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు వెంటనే రుణమాఫీ చేయాలని బీడీ కార్మికుల మాదిరి పింఛను ఇవ్వాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'మరో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు'