తెలంగాణ మంత్రి మండలి సమావేశం ఒకట్రెండు రోజుల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఆర్టీసీ సమ్మె, ప్రత్యామ్నాయాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కేంద్రం జారీ చేసిన మోటారు వాహనాల సవరణ చట్టం-2019 అమలు, ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వడం తదితర ప్రతిపాదనలనూ మండలి ఎజెండాలో చేర్చనున్నట్లు తెలిసింది. సోమవారం ఉన్నత స్థాయిలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఆర్టీసీ సమ్మెపై సీఎం స్థాయిలో తరచూ సమావేశాలు జరుగుతున్నప్పటికీ విధాన నిర్ణయాల కోసం మంత్రి మండలిని సమావేశపరచాలని తాజాగా సర్కారు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చివరిసారిగా ఈ నెల మొదటి తేదీన, ఆర్టీసీ సమ్మెకు ముందు మంత్రి మండలి సమావేశం జరిగింది. అందులో సమ్మె నివారణకు ముగ్గురు ఐఏఎస్లతో కమిటీని నియమించారు. కార్మిక సంఘాలతో కమిటీ చర్చలు విఫలమయ్యాయి. ఈ నెల 5న సమ్మె మొదలై కొనసాగుతున్న నేపథ్యంలో మంత్రి మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి.
ఇవీ చూడండి : నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ