రాష్ట్రంలో దాదాపు 40 కళాశాలల్లో బీటెక్లో కొత్త కోర్సుల్లో సీట్లు పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో సుమారు 5 వేల వరకు సీట్లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు (increase seats in new courses in BTech ). కొత్త సీట్లకు సంబంధించి ఒకటిరెండు రోజుల్లో ఎన్ఓసీ జారీ చేస్తూ జీవో రావొచ్చని అధికారవర్గాలు తెలిపాయి (noc for new seats increase in b tech). కొత్త సీట్లపై పలు ఇంజినీరింగ్ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించడం, వాటికి అనుమతివ్వాలని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులివ్వడం తెలిసిందే. ఈక్రమంలోనే ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు సమాచారం. అందుకే ఎంసెట్ ప్రవేశాల కమిటీ ఈ వారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది.
ఈనెల 6-10వ తేదీ వరకు ఐసెట్ ధ్రువపత్రాల పరిశీలన ఉన్నా.. ఎంసెట్ తుది విడత సర్టిఫికెట్ల పరిశీలనకు 2 వేల మందికి మించి రాకపోవచ్చన్నది అధికారుల అంచనా. అందుకే ఐసెట్ కౌన్సెలింగ్ జరుగుతుండగానే ఒకరోజు ఎంసెట్ కోసం అదనంగా సిబ్బందిని నియమిస్తే సరిపోతుందని భావిస్తున్నారు.
కాషన్ డిపాజిట్ చెల్లించాల్సిందే
చివరి విడతలో సీట్లు పొందిన విద్యార్థుల నుంచి ఈసారి కాషన్ డిపాజిట్ వసూలు చేయనున్నారు. పూర్తి బోధన రుసుమునకు అర్హులైన వారు ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర కళాశాలల్లో సీట్లు వచ్చినా ఎంసెట్ సీట్లను రద్దు చేసుకోవడం లేదు. వాటిని ఇతరులకు కేటాయించలేని పరిస్థితి. అందుకే కాషన్ డిపాజిట్ వసూలు చేస్తే ఆ డబ్బు కోసమైనా సీట్లు రద్దు చేసుకుంటారని, స్పెషల్ కౌన్సెలింగ్లో వాటిని భర్తీ చేయవచ్చని అధికారుల ఆలోచన.
ఎస్సీ, ఎస్టీలకు రూ.5 వేలు, ఇతరులకు(10 వేల ర్యాంకు లోపువారు) రూ.10 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందని అధికారి ఒకరు చెప్పారు. మరోవైపు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ప్రకటించిన అక్టోబరు 15 నుంచి ఇప్పటివరకు దాదాపు 2 వేల మంది విద్యార్థులు ఎంసెట్ సీట్లను రద్దు చేసుకున్నారు.
ఇదీ చూడండి: 'అక్కడ ఇంజినీరింగ్ చేయాలంటే ఎన్ఓసీ తప్పనిసరి'