ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ఏ మాత్రం స్పందించడం లేదని కార్మిక సంఘాలు ఆరోపించాయి. హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ ఎండీని కలిసిన కార్మిక సంఘ నాయకులు సమ్మె నోటీసును అందజేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, 2017 నుంచి చేయాల్సిన వేతన సవరణ వంటి అంశాలపై స్పష్టత లేదని సంఘం అధ్యక్షుడు వెంకటాచారి ఆరోపించారు. ఈ నెల 27 నుంచి ఎప్పుడైనా సమ్మెకు దిగవచ్చని అన్నారు. సర్కారు వద్ద ప్రజా ప్రతినిధుల జీత భత్యాలకు లక్షల రూపాయలు ఇవ్వడానికి నిధులుంటాయి కానీ... ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవడానికి నిధులుండవని మజ్దూర్ సంఘం నాయకులు శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
ప్రయాణికుల ఆందోళన
సమ్మె నోటీసు నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నెల 27వ తేదీ అనంతరం ఆర్టీసీ బస్సులు నడుస్తాయో.. లేదో అన్న సందిగ్థత నెలకొంది. అటు సమ్మె విషయంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.
ఇదీ చూడండి : ఊరంతా సంబురం... ముగిసిన గణపతి నిమజ్జనం...