High command focus on Telangana BJP: గత కొద్ది రోజులుగా తెలంగాణ కమలం పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా సొంత పార్టీ నేతలు విమర్శనాస్త్రాలు సంధించడం వంటి తాజా పరిణామాలతో నేతలు అయోమయంలో పడగా.. దీనిపై దృష్టి సారించిన ఆ పార్టీ హైకమాండ్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆరా తీసింది. తమ వేగుల ద్వారా కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు.
అధికారమే లక్ష్యంగా ముందుకు వెళ్తోన్న వేళ పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని నేతలకు సూచిస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలో పార్టీని గాడిలో పెట్టే పనిలో జాతీయ నాయకత్వం పడింది. గత కొద్ది రోజులుగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాయకత్వంపై ఎంపీ ధర్మపురి అర్వింద్, పేరాల శేఖరరావు, అంజన్న, తదితరులు బహిర్గతం గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఎమ్మెల్సీ కవితపై సంజయ్ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేక వర్గం ఆయుధంగా మల్చుకుంది.
MP Arvind and Rajasingh quarrel: చేరికల కమిటీ ఛైర్మన్ పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా.. ఈ వార్తలను ఈటల ఖండించారు. ఇది ఇలా ఉండగా.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన అనుచిత వ్యాఖలను తాను ఖండిస్తున్నట్లు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు సంజయ్ వ్యక్తిగతమని.. దీనికి ఆయన సమాధానం ఇచ్చుకోవాలని సూచించారు.
అర్వింద్ వ్యాఖ్యలను గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం కాదన్నారు. బండి సంజయ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడని.. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదనే నాలెడ్జ్ ఆయనకు ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరు పార్లమెంట్ సభ్యులేనని దిల్లీలో కలుస్తూనే ఉంటారన్న రాజాసింగ్.. అర్వింద్కి ఏదైనా ఇబ్బంది ఉంటే నేరుగా సంజయ్తో మాట్లాడాలే తప్ప మీడియా ముందుకు వచ్చి కామెంట్లు చేయడం సరికాదని సూచించారు.
Womens commission notices to Bandi Sanjay: మరోవైపు రాష్ట్ర మహిళ కమిషన్.. బండి సంజయ్కు నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11గంటలకు కమీషన్ ముందు హాజరుకావలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై స్పందించిన సంజయ్ ఇవాళ రాలేనని ఈనెల 18న నేరుగా హాజరవుతానని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: